హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావం అనంతరం గురువారం రెండో రోజు కూడా ఢిల్లీలో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సీఎం కేసీఆర్ అందరికీ అందుబాటులో ఉంటూ సందర్శకులు, ప్రజా ప్రతినిధులతో గురువారం రోజంతా బిజీబిజీగా గడిపారు. బిఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభ వేడుకల్లో స్వయంగా పాల్గొనేందుకు తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి వచ్చిన వందలాది రైతు సంఘాల నేతలు, ప్రముఖులతో సీఎం కేసిఆర్ అధికారిక నివాసం, తుగ్లక్ రోడ్ పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిసిపోయాయి.
ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ తనను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి అభిమాని, కార్యకర్తను పేరు పేరునా పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో పలువురు కేసీఆర్తో ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. టిఆర్ఎస్ పార్టీ బిఅర్ఎస్గా జాతీయ పార్టీగా అవతరించిన చారిత్రక ఘట్టం నేపథ్యంలో, తమ అభిమాన నేతను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఫోటో దిగి, తమ ఢిల్లి జ్ఞాపకాలను పదిలంగా దాచుకుని నూతనోత్సా#హంతో అభిమానులు తిరుగు ప్రయాణమయ్యారు.
పలువురి పూజలు…మొక్కులు….
భారత రాష్ట్ర సమితిగా ఎన్నికల సంఘం గుర్తించిన అనంతరం మొదటిసారిగా ఢిల్లి పర్యటనలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్కు కలకత్తా కాళీమాత అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని, దేశ రాజకీయాలలో ఆయన చక్రం తిప్పాలని, తెలంగాణ రాష్ట్ర తరహాలో దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందాలని పలువురు ప్రార్ధనలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఢిల్లి వీధుల్లో నినదించారు. తెలంగాణ తరహాలోనే దేశం మొత్తానికి అద్భుతమైన సుపరిపాలన అందించాలని కాంక్షిస్తూ గురువారంనాడు తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రభుత్వ మాజీ అనుసంధాన అధికారి దొంత రమేష్, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినీ స్వప్నకోటిల ఆధ్వర్యంలో కలకత్తా కాళీకా మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
నాంపల్లి యూసిఫియన్ దర్గాలో చాదర్ సమర్పణ, ప్రత్యేక ప్రార్థనలు..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్తున్నారని మాజీ డిప్యూటీ మేయర్, బోరాబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు శుభసందర్భంగా నాంపల్లిలోని యూసిఫియన్ దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వ#హంచారు. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.
హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ ప్రయాణికులకు షాక్..
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు విమాన చార్జీలు భారీగా పెరిగాయి. ఆకస్మాత్తుగా పెరిగిన ఫ్లైట్ టికెట్స్ చార్జెస్తో బీఆర్ఎస్ అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదంతా బి.ఆర్ ఎస్ ఎఫెక్ట్ అని జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వేలాదిగా హైదరాబాద్నుంచి కార్యకర్తలు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రిటర్న్ ఫ్లైట్ టికెట్ నాలుగింతలు కావడంతో దిక్కులేక కొందరు అక్కడే స్టే చేసినట్లు సమాచారం.