Thursday, April 25, 2024

క‌న్న‌డిగుల‌పై గులాబీ బాస్ గురి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (భారాస) విస్తరణకు నడుం బిగించిన పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఎన్నికలపై దృష్టి సారించారు. కర్ణాటకలోని జనతా దళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌)తో కలిసి ఎన్నికల్లో పోటీ- చేసేందుకు సిద్ధమైన కేసీఆర్‌ వచ్చే వారం ఆ రాష్ట్రంలో పర్యటనకు సమాయత్తమవుతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో నిర్వహించిన రెండు బహిరంగ సభలు విజయవంతం కావడంతో ఈ సభల తరహాలోనే కర్ణాటకలో తెలుగు ఎక్కువగా మాట్లాడే రాయచూర్‌, గుల్భర్గా, సింధనూర్‌ ప్రాంతాలలో సభలు జరిపేందుకు సమాయత్తం అవుతున్నట్టు- తెలుస్తోంది. బహిరంగ సభల నిర్వహణకు తోడుగా భాజపా, కాంగ్రెస్‌లకు చెందిన అసంతృప్త నేతలు, మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యనేతలను భారాసలో చేరేవిధంగా వ్యూహం రచించాలని కేసీఆర్‌ ఆ రాష్ట్ర భారాస నేతలను కోరినట్టు- తెలుస్తోంది. కర్ణాటకలో సభల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి నారాయణపేట, మక్తల్‌, గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కేసీఆర్‌ కోరినట్టు- సమాచారం.
2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జేడీఎస్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ దగ్గరైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరువురి మధ్య సంబంధాలు కొనసాగడంతో పాటు- భారాస ఆవిర్భావ సమయంలో జేడీఎస్‌ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలకంగా వ్యవహరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించిన సంగతి విదితమే.

హైదరాబాద్‌-కర్ణాటక, ముంబై-కర్ణాటక ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉండే నియోజక వర్గాలను ఎంపిక చేసి అక్కడ భారాస అభ్యర్థులను బరిలోకి దింపే ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్టు- తెలుస్తోంది. బళ్లారి, సింధనూర్‌, రాయచూర్‌, కొప్పాల్‌ వంటి ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు అధికంగా ఉన్నారని బీదర్‌, గుల్బర్గా(కలబుర్గి) వంటి ప్రాంతాల్లో భారాసకు మద్దతుందని చెబుతున్నారు. హైదరాబాద్‌-కర్ణాటకలోని 31 నియోజకవర్గాలతోపాటు-.. ముంబై-కర్ణాటకలోని 50 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోపాటు-.. మంత్రులు, ఎంపీలు ప్రచారం చేసి పార్టీ నిలబెట్టిన అభ్యర్థులతో పాటు- జేడీఎస్‌ ఎంపిక చేసిన నేతల గెలుపునకు విస్తృతంగా ప్రచారం చేయవచ్చన్న ధీమాతో ఉన్నట్టు- సమాచారం. తెలంగాణతో పాటు- తెలుగువారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు పోటీ- చేయాలన్నది చర్చించి తుది నిర్ణయానికి వద్దామని కేసీఆర్‌ ఇప్పటికే కుమారస్వామికి ప్రతిపాదన చేసినట్టు- సమాచారం.

రంగంలోకి తృణమూల్‌
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు పలికారు. ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ ఓటమే ధ్యేయంగా ఆమె జేడీఎస్‌ తరఫున ప్రచారం నిర్వహించనున్నట్టు- సమాచారం. గత వారం కుమారస్వామి కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మద్దతు కోరారు. కర్ణాటకలో జేడీఎస్‌ తరఫున ప్రచారం చేయాలంటూ ఆయన చేసిన అభ్యర్థనకు మమత అంగీకారం తెలిపారు. షెడ్యూల్‌ను పంపితే.. తాను ప్రచారానికి సిద్ధమని ఆమె కుమారస్వామికి హామీ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ కోల్‌కతాలో విపక్షాలతో ఏర్పాటు- చేసిన సమావేశానికి కుమారస్వామి హాజరయ్యారు. జేడీఎస్‌, బీఆర్‌ఎస్‌, టీ-ఎంసీల ప్రధాన లక్ష్యం కర్ణాటకలో బీజేపీని గద్దెదించడమే కావడంతో.. అంతా కలిసికట్టు-గా పనిచేస్తారని స్పష్టమవుతోంది. ఈ అంచనాల నేపథ్యంలో.. మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం కర్ణాటకలో విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో జేడీఎస్‌కే అధికార పగ్గాలు దక్కుతాయని, కుమారస్వామి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. 123 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.

వ్యూహాలు-ప్రతివ్యూహాలు, మిత్రపక్షాలు – వైరివర్గాలు.. ఇలా ఎన్ని అంచనాలు వేసుకున్నా ఈసారి కన్నడనాట ఎన్నికల పోరు రసవత్తరంగానే ఉంటు-ందని భారాస అంచనా వేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ-కి వెళ్తుండడం జేడీఎస్‌కు కలిసివచ్చే అంశమని భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహం ఫలిస్తుందన్న లెక్కలను భారాస వేసుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థు ల ఎంపిక, ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్లాలని ఈ మేరకు కుమారస్వామితో చర్చించి ముందుకు వెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు- సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement