ఖమ్మంలో జిల్లాలో ఘోరం జరిగింది. ఈమధ్య ఆత్మహత్య చేసుకున్న బీజేపీ లీడర్ సాయిగణేష్ కాబోయే భార్య కూడా ఆత్మహత్యకు యత్నించింది. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన విజయకు ఖమ్మం జిల్లా బీజేపీ లీడర్ అయిన సాయి గణేష్ తో గత నెలలో నిశ్చితార్థం జరిగింది. కాగా, మే 4వ తేదీన వారి వివాహం జరగాల్సి ఉంది. ఏప్రిల్ 14న ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో అతను పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ ఏప్రిల్ 16న చనిపోయాడు.
అప్పటినుంచి మానసిక ఆందోళనకు గురైన విజయ శనివారం ఖమ్మం చేరుకుని జూబ్లీ క్లబ్ వెనుక ప్రాంతంలో సాయి గణేష్ నిర్మించిన బీజేపీ స్థూపం వద్ద నిద్ర మాత్రలు మింగి సూసైడ్కి పాల్పడింది. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, సాయి గణేష్ అభిమానులు భారీ సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు తరలిరావడంతో ఖమ్మం సిటీలో మళ్లీ కలకలం చెలరేగింది.