Sunday, April 28, 2024

బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు.. రేవంత్ రెడ్డి

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలల్లా కలిసి ఉన్నారని, కానీ ఇప్పుడు ప్రజల ముందు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హార్ట్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కేటీకే 5 ఇంక్లైన్ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మోడీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించాకనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసి కార్మిక సంఘానికి హరీష్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నా కార్మిక సంఘాలను కూడా వారి కుటుంబమే గుతాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతున్నారన్నారు. సీఎం కూతురే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. వేలాది కోట్లు కొల్లగట్టడానికే తప్ప.. కార్మికుల సమస్యలు తీర్చడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదన్నారు. ప్రజా వ్యతిరేకత చూసి భయంతో బీజేపీ, బీఆర్ఎస్ వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాడిచర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు. తాడిచర్ల మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత అని ప్రశ్నించారు. ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్ ను ఆదానికి అమ్మేస్తే… దానిపై కాంగ్రెస్ ఎంపీలం కొట్లాడామని అన్నారు. అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయిందన్నారు. ప్రతిమా శ్రీనివాస్ కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.


కేసీఆర్, మోడీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానం అని, శ్రీధర్ ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్ కు ఉన్న ఉపయోగం ఏమిటో కార్మికులు ఆలోచించాలన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారన్నారు. వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణకు అదేశిస్తామన్నారు. సింగరేణిని లాభాల బాటలో పయనించేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయన్నారు. ఎవరు అధికారంలో ఉంటే కార్మికుల కష్టాలు తీరుతాయో ఆలోచించండన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందన్నారు. కేసీఆర్ మారడు.. ఇక ఆయన్ని మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ తెచ్చిన అని చెప్పిన కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధించడమే కాదు.. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కార్మికులపై ఉందన్నారు. ఈ గేట్ మీటింగ్ లో వారి వెంట టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మహబూ బాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, భూపాలపల్లి డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, పలువురు ఐఎన్ టియుసి ముఖ్య నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement