Thursday, May 9, 2024

Big Story : వైవీ సుబ్బారెడ్డికి – విశాఖపట్నం పార్టీ వ్యవహారాలు,స‌మ‌న్వ‌యం బాద్య‌త‌లు !

ఏపీలో 14 మంది కొత్త మంత్రులతో క్యాబినెట్‌ను పునర్నిర్మించి, గత క్యాబినెట్‌లోని 11 మంది మంత్రులను కొనసాగించిన తరువాత సీఎం జ‌గ‌న్ తన పార్టీ పై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉత్తర కోస్తా జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను నిర్వహించే బాధ్యత నుండి జ‌గ‌న్ తనకు నమ్మకమైన ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డిని మార్చినట్లు సమాచారం. సాయి రెడ్డి ఇప్పుడు యువజన విభాగం, మహిళా విభాగం, కార్మిక విభాగం, రైతు విభాగం మొదలైన పార్టీ అనుబంధ విభాగాలకు మాత్రమే పరిమితం అవుతారు.అంతే కాకుండా, ఆయన రాష్ట్ర స్థాయిలో మొత్తం పార్టీ కార్యకలాపాలను కూడా సమన్వయం చేస్తారు ఇప్పటి వరకు, సాయి రెడ్డి న్యూఢిల్లీలో అనుసంధానం చేయడంతో సహా పార్టీలో, ప్రభుత్వంలో బహుళ పాత్రలు పోషిస్తున్నారు. ఇకపై, జగన్ బాబాయ్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి విశాఖపట్నంలో పార్టీ కార్యకలాపాలు, సమన్వయాన్ని చూసుకుంటారు.

ఈ బాధ్యతను ఇప్పటివరకు సాయిరెడ్డి నిర్వహించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో పాటు ఆయా జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించనున్నారు. ఈ రెండు జిల్లాలు మొదటి నుంచి బొత్సకు కంచుకోటగా ఉన్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉమ్మడి జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను జగన్ కుడిభుజం, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చూసుకోవడం మరో ఆసక్తికర పరిణామం. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పార్టీని చూసుకుంటారు. మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీని చూసుకుంటారు.అలాగే వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. వాస్తవానికి విశాఖపట్నం పార్టీ ఇన్‌చార్జి పదవికి వేమిరెడ్డి పేరు గతంలోనే వినిపించింది. పార్టీకి అధికారిక ఉత్తర్వులు లేవు. ముగ్గురు నేతలకు జగన్ మౌఖికంగా సూచనలు చేసినట్లు చెబుతున్నారు. వారు తదుపరి ఎన్నికల వరకు పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించనున్నట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement