Sunday, May 5, 2024

Bandi Sanjay: 317 జీవోతో గందరగోళం.. ఉద్యోగుల్లో అయోమయం

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 వ‌ల్ల‌ ఉద్యోగుల స్థానికతకు ప్రమాదం ఏర్పడిందని ఆయన అన్నారు. కేసీఆర్‌ తుగ్లక్‌ పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జీవో 317తో ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంద‌న్నారు. దీంతో స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో వేరే జిల్లాలకు వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఏర్పడ్డాయ‌ని ఆయ‌న చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయ లబ్ది పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్న సీఎం ఆ డబ్బుతోపాటు ఉద్యోగుల సమస్యలపై రాజకీయ డ్రామాలాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తరువాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement