Monday, April 29, 2024

అప్పు వస్తున్నాడు.. పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ సినిమా పై చిరంజీవి ఎమోషనల్..

దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాజ్ కుమార్ ఫ్యామిలీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. అలాంటి కుటుంబంలో అందరి కంటే చిన్నవాడు పునీత్ (అప్పు) హఠాన్మరణం చెందినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత చిన్న వయసులో అప్పు అందర్నీ వదిలేసి వెళతాడు అని కలలో కూడా అనుకోలేదు అంటూ ఆయన కడసారి చూపు చూసేందుకు వెళ్లారు మెగాస్టార్. అయితే తాజాగా మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్ విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సోషల్ మీడియాలో ‘అప్పు వస్తున్నాడు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. పునీత్ రాజ్ కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు.

‘ప్రియమైన అప్పూ.. ఓ రోజు ఉదయాన్నే లేచి చూడగానే నువ్వు లేవన్నారు. అనూహ్యంగా మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వు వెళ్లిపోయావు. ఈ విషయాన్ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు నటించిన ఆఖరి చిత్రం ‘జేమ్స్‌’ విడుదల అవుతోంది. ఈ సందర్భం మమ్మల్ని ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నువ్వు లేవన్న బాధ ఒకవైపు ఉన్నా కనీసం నీ ఆఖరి చిత్రం రూపంలో నువ్వు మరోసారి మమ్మల్ని పలకరించబోతున్నావు. కానీ ఈ సమయంలో నువ్వు మాతో లేవన్న నిజం కలచివేస్తోంది’ అంటూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు చిరంజీవి. జేమ్స్‌ సినిమాను ఏకంగా 4 వేల స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. మరోవైపు కర్నాటక మూవీ డిస్ట్రిబ్యూటర్లు పునీత్‌కు నివాళిగా మార్చి 17 నుంచి 23 వరకు ఏ చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. జేమ్స్‌ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement