ఐఫోన్ అంటేనే బ్రాండ్ కి పెట్టింది పేరు. ఐఫోన్ వాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అతిఖరీదైన ఈ లగ్జరీ ఫోన్ ని ఇష్టపడనివారు ఉండరు. అయితే ఈ లగ్జరీ ఫోన్లు మన ఇండియాలో తయారీ కానున్నాయి. మనదేశంలో యాపిల్ కు సంబంధించి అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ ఐఫోన్ 13. ఇప్పటి వరకు చైనా, తైవాన్ తయారీల ఐ ఫోన్లని వాడుతున్నాం. ఇకపై మేడ్ ఇన్ ఇండియా’ యాపిల్ ఐ ఫోన్లను ఇకపై చూడబోతున్నాం. అది కూడా అతి సమీపంలోనే. తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ చెన్నైకు సమీపంలోని తన యూనిట్ లో ప్రయోగాత్మకంగా ఐఫోన్13 మోడల్ తయారీని మొదలు పెట్టింది.
అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు కాంట్రాక్టు తయారీ సేవలను ఫాక్స్ కాన్ అందిస్తుంటుంది. భారత్ లో తయారీ దిశగా యాపిల్ అడుగులు వేసేలా చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు కృషి ఫలించింది. దిగుమతి సుంకాలు పెంచడంతో దేశీయంగా ఐఫోన్ల ధరలు ప్రియం అయ్యాయి. మరోవైపు ఇక్కడే తయారు చేస్తే రాయితీలు ఇస్తామని కేంద్ర సర్కారు ఆశ చూపించింది. దీంతో యాపిల్ అంగీకరించక తప్పలేదు.సెమీకండక్టర్ చిప్ ల కోసం యాపిల్ సరఫరాదారుల నుంచి హామీ పొందడంతో భారత్ లో తయారీకి, విక్రయాలకు ఇకమీదట ఇబ్బంది ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.
సుమారు 130కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్ యాపిల్ కు ఎంతో కీలకం. అందుకనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యాపిల్ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. భారత మార్కెట్ కోసమే కాకుండా.. ఎగుమతి మార్కెట్లకూ భారత్ లో తయారీ వ్యూహాన్ని అనుసరించాలన్నది యాపిల్ తాజా విధానం. భారత్ లో విక్రయమయ్యే అన్ని ప్రధాన మోడళ్లను యాపిల్ ఇక మీదట ఇక్కడే తయారు చేయించనుంది. ఈ విషయాన్ని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారత మార్కెట్ కే కాకుండా, ఎగుమతుల కోసం ఐఫోన్ 13 వాణిజ్య తయారీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుందని తెలిపాయి. ఇక్కడ తయారు చేసే యూనిట్లలో 20-30 శాతాన్ని ఎగుమతి చేయవచ్చని పేర్కొన్నాయి.సో ఇక నుంచి ఐఫోన్ లు ఇండియాలోనే తయారు కానున్నాయి. మరి ఈ మేరకు రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..