సాదా బైనామాల (తెల్ల కాగితలపై జరిపిన భూక్రయ విక్రయాలు)పై ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. తాజాగా ప్రభుత్వ స్థలాలు, యూఎల్సీ భూముల్లో ఇండ్లు కట్టికున్న వారికి క్రమబద్దీకరణ అవకాశమిచ్చిన ప్రభుత్వం తాజాగా వీటిని కూడా ఉదారంగా పరిశీలిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదట 2016 జూన్ 3న సీఎం కేసీఆర్ సాదాబైనామాల ఉచిత క్రమబద్దీకరణ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: అప్పట్లో దాదాపు 11,19,112 దరఖాస్తులు రాగా వీటిలో 2,68,610 ఎకరాలకు సంబంధించిన 6లక్షల 18వేల 368 దరఖాస్తులను క్రమబద్దీకరించారు. ఇందులో 4,19,430 దరఖాస్తులను వివిధ కారణాలతో ప్రభుత్వం తిరస్కరించింది. ఇలా మిగిలిన 2,45,668 ఎకరాల క్రమబద్దీకరణను పూర్తి చేసి నిరుపేదలక ఉచిత రిజిస్ట్రేషన్ చేయించాలని యోచిస్తోంది. కాగా వీటికి కూడా అనుమతినివ్వాలని తాజాగా సీసీఎల్ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ సీసీఎల్ఏ కార్యాలయం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ దఫా క్రమబద్దీకరణకు పట్టణాల్లోని భూములూ అవకాశం పొందనున్నాయి. ఇందులో కుడా, హెచ్ఎండీఏ, మున్సిపల్, నగర పంచాయతీల భూములకూ స్థానం దక్కనుంది.
తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. సాదాబైనామాలకు పలు దశల్లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెల్ల కాగితాలపై చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాలకు చట్టబద్దత పూర్తి చేశారు. ఇందుకు ధృవీకరణ పత్రాల అందజేతకు సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. 13బీ ధృవీకరణ పత్రాన్ని సేఫ్టీ బార్కోడ్ క్విక్ రెస్పాన్స్ కోడ్ ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో 11,19,112 దరఖాస్తులను పరిశీలిస్తోంది.
గతంలో ఈ అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘‘ తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు సాదాబైనామాల మీద జరుగుతున్నాయి.. డబ్బులు లేకనో.. అవగాహన లేకనో పేద ప్రజలు పట్టా చేయించుకోవడం లేదు” అన్నారు. పేదలకు భారం కాకుండా వీటిని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో గత 20-30 ఏళ్లుగా కాగితాల మీదనే ఉన్న భూముల క్రయవిక్రయాల వ్యవహారం రిజిస్ట్రేషన్తో చట్టబద్దం కానుంది. 2014 జూన్ 2నాటికి సాదాబైనామాల మీద ఉన్న ఐదు ఎకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్టర్ చేసి, పేరు మార్పిడి చేయాలని ఆయన ఆదేశించారు. పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అర్భన్లో 27.057, వరంగల్ రూరల్లో 26,630, జనగామలో 10,350, సంగారెడ్డిలో 703 కలుపుకుని 64,740 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.
దరఖాస్తుల వివరాలు.. ఉమ్మడి జిల్లాల వారీగా…
మహబూబ్నగర్ 27, 622
రంగారెడ్డి 5, 065
హైదరాబాద్ 12
మెదక్ 59, 662
నిజామాబాద్ 88, 211
ఆదిలాబాద్ 45, 223
కరీంనగర్ 24, 2079
వరంగల్ 29, 7699
ఖమ్మం 19, 7845
నల్గొండ 13, 2926