Friday, May 3, 2024

బ్లాక్ దందా: ఆనందయ్య మందు రూ.20 వేలు!

దేశవ్యాప్తంగా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య నాటు మందు హాట్ టాపిక్ గా మారింది. జనం నుంచి అనూహ్య మద్దతు వస్తుండటంతో మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. ఐసీఎంఆర్ కూడా నివేదికను సిద్దం చేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. దీంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో కృష్ణపట్నంకు క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న కొందరు రోగులు చెప్పారు. దీంతో ఆనందయ్య మందుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య నాటు మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్ట రాకపోయినా.. ప్రజలు మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. వేల సంఖ్యలో ఆ మందు కోసం ఎగబడుతున్నారు.

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందుపై దృష్టి పడింది. ఈ మందు హానికరం కాదని తెలడంతో.. ఎంత ఖర్చైనా సరే మందు తీసుకోవాలని కొందరు భావిస్తున్నారు. అయితే, ప్రజల్లో ఉన్న నమ్మకాలను క్యాష్ చేసుకున్న కొందరు ఆనందయ్య మందును బ్లాక్ మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆనందయ్య నాటు మందు పంపిణీని అధికారులు నిలిపివేసినా.. బ్లాక్ లో మాత్రం ఈ దందా కొనసాగుతోంది. హైదరాబాద్కు చెందిన రవి తన బంధువుల కోసం ఐ డ్రాప్స్ను రూ.20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. డబ్బు చెల్లించే రవి స్నేహితుడు సాయి ఉచితంగా ఇచ్చే దానికి రూ.20,000 ఎందుకు అని ప్రశ్నించగా… డబ్బులు లాక్కుని కృష్ణ పట్నంకు చెందిన నాగరాజు పరారయ్యాడు.

సాయి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మందు హానికరం కాదని నివేదిక రావడంతో మరింత డిమాండ్ పెరిగింది. దీంతో కృష్ణపట్నంలోకి పోలీసులు ఎవరిని అనుమతించకపోవడంతో కృష్ణపట్నం గ్రామస్తులు ఫోన్ ద్వారా బేరసారాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement