Thursday, May 2, 2024

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం, విదేశీ పర్యటనలో కేటీఆర్‌.. పది రోజుల పాటు యూకేలో పర్యటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం లండన్‌ బయలుదేరి వెళ్లారు. యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తొలుత బుధవారం నుంచి 21 వరకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో మంత్రి పర్యటిస్తారు. యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌(యూకేఐబీసీ) నిర్వహించే సమావేశాల్లో పాల్గొని వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో పెట్టుబడులపై మంత్రి చర్చించనున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన పేరొందిన కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమవుతారు. అనంతరం 22 నుంచి26 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాల్లో కేటీఆర్‌ పాల్గొంటారు. కొవిడ్‌ తర్వాత ప్రత్యక్షంగా జరుగుతున్న దావోస్‌ డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలకు ఈసారి అత్యంత ప్రాధాన్యం ఉన్నందున వీటికి కేటీఆర్‌ హాజరవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దావోస్‌ సమావేశాల్లో భాగంగా కేటీఆర్‌ పలు కంపెనీల సీఈవోలతో సమావేశాలతో ప్రత్యేకంగా సమావేశమవనున్నారు. మొత్తం 2వేల మంది దాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు పేరొందిన కంపెనీల ప్రతినిధులకు తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించే అవకాశం కేటీఆర్‌ బృందానికి డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల ద్వారా లభించనుంది. డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలు జరిగే దావోస్‌లో ఇప్పటికే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ తరపున ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, పెట్టుబడిదారులకు వివరించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మీ నాయకత్వంలో తెలంగాణ టెక్నాలజీ పవర్‌హౌజ్‌గా తీర్చిదిద్దుతున్నారని, భారతేదేశాన్ని టెక్నాలజీ, ఆవిష్కరణల హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర మీదేనని డబ్లూఈఎఫ్‌ చైర్మన్‌ బోర్జ్‌ బ్రెండీ వ్యాఖ్యానించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement