Friday, May 3, 2024

TRSలో ఎంపీ సీటు ఖాళీ.. ఈసారి ఛాన్స్ ఎవరికి?

టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ రాజీనామాతో ఎంపీ సీటు ఖాళీ అయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపీ బండ ప్రకాష్‌ను ఎంపిక చేయడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదించారు. దీంతో ఆ సీటు ఖాళీగా అయ్యింది. ఈ నేపథ్యంలో తదుపరి ఎవరు అవుతారన్నదానిపై చర్చ మొదలైంది. సీఎం కేసీఆర్ 2018 ఏప్రిల్‌లో బండ ప్రకాష్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మరో మూడేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభ ఎంపీ సీటుకు ఎన్నిక అనివార్యం కానుంది. ఆ సీటుని ఎవరితో భర్తీ చేస్తారు? అన్నది ఉత్కంఠగా మారింది.

తొలుత రాజ్యసభ సీటును ఎమ్మెల్సీ కవితకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా సీఎం కేసీఆర్ ఆమెను నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలో నిలిపారు. దీంతో ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ క్రమంలో సీఎం ఎవరిని ఎంపిక చేస్తారు? అన్నది సస్పెన్స్ గా మారింది.

మరోవైపు ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం టీఆర్ఎస్ పార్టీలోని కొందరు సీనియర్లు ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన వినోద్ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్  కొనసాగుతున్నారు. అదే సమయంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎవరికి రాజ్యసభ సీటు కేటాయిస్తారు? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement