Friday, April 26, 2024

నేటి నుంచే ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం..

విశ్వక్రీడా సంబరమైన ఒలింపిక్స్ కు నేడు తెరలేవనుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది జరగాల్సిన క్రీడలు వాయిదా పడగా ఎట్టకేలకు నేడు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల మధ్య ప్రేక్షకులు లేకుండా శుక్రవారం విశ్వక్రీడలు ప్రారంభమవన్నాయి. జపాన్‌లో కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో చివరి నిమిషం దాకా ఒలింపిక్స్‌ జరుగుతాయా లేదా అన్న అనుమానాలు రేగినా.. ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (ఐవోసీ), నిర్వాహకులు చెప్పిన విధంగానే క్రీడలకు అంకురార్పన చేసేందుకు సంకల్పించారు.

మొత్తం 206 దేశాలకు చెందిన 11,300 మంది క్రీడాకారులు వివిధ అంశాల్లో పోటీ పడనున్నారు. భారత్ నుంచి 120 మంది వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో భారత బృందం ఒలింపిక్స్‌కు వెళ్లలేదు. వీరిలో 68 మంది పురుషులు కాగా, 52 మంది మహిళలు ఉన్నారు. ఆర్చరీ, ఆర్టిస్టిక్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బ్యాండ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి 18 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు.

వీరిలో నలుగురు.. పీవీ సింధు, సానియా మీర్జా, సాయి ప్రణీత్, సాత్విక్‌లు తెలుగు తేజాలు. గత ఒలింపిక్స్‌లో రజత పతకం అందుకున్న సింధు..ఈసారి పసిడిపై కన్నేసింది. జపాన్ జాతీయ స్టేడియంలో ఒలింపిక్స్‌ను ప్రారంభించనున్నారు.

విశ్వక్రీడా సంరంభంలో తొలి రోజే భారత్‌ తన పతకాల వేటకు గురి పెట్టనుంది. ఉదయం యుమేనొషిమా పార్క్‌ ఆర్చరీ ఫీల్డ్‌లో.. మహిళల, పురుషుల వ్యక్తిగత అర్హత రౌండ్లు జరుగనున్నాయి. భారత్‌కు ఈసారి కచ్చితంగా పతకాలు రాగలవన్న క్రీడలలో ఆర్చరీ కూడా ఉంది. ఆర్చరీలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ దీపికా కుమారితో పాటు ఆమె భర్త అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌ బరిలోకి దిగనున్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటిదాకా ఆర్చరీలో ఒక్క పతకం కూడా రాలేదు.

ఇది కూడా చదవండి : ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి బొత్స ఆదేశాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement