Friday, May 3, 2024

అండర్‌-19 వరల్డ్‌కప్ క్వార్టర్స్‌లో భారత్‌..

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత యువజట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో సఫారీజట్టుపై గెలిచిన భారతజట్టు రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సత్తా చాటింది. 174పరుగుల తేడాతో గెలిచి భారీ విజయాన్ని అందుకుంది. ఒకవైపు కరోనా బారినపడిన కెప్టెన్‌ యశ్‌దుల్‌తోపాటు కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకున్నా భారతజట్టు వెనుకంజ వేయలేదు. నిశాంత్‌ సింధు నేతృతంలో భారతజట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి 50ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 307పరుగులు చేసింది. టాస్‌గెలిచిన ఐర్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన యువ భారత్‌ భారీస్కోరు సాధించింది. ఓపెనర్లు హర్నూర్‌సింగ్‌ 101బంతుల్లో 12ఫోర్లుతో 88పరుగులు, రఘువంశీ 79బంతుల్లో 79పరుగులుతో అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 164పరుగులు భాగస్వామ్యంతో పటిష్ఠ పునాది వేశారు.

ఓపెనర్లతోపాటు టాపార్డర్‌ కూడా మెరుగైన ప్రదర్శనతో రాణించింది. రాజ్‌ (42), కెప్టెన్‌ నిశాంత్‌ (36), రాజ్‌వర్ధన్‌ (39) ఆకట్టుకున్నారు. మొత్తంమీద భారతజట్టు 50ఓవర్లలో 307పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా విజృంభించడంతో ఐర్లాండ్‌ 133పరుగులుకే కుప్పకూలింది. 40బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స్‌లతో 32పరుగులు చేసిన స్కాట్‌ మెక్‌బెత్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మొత్తంమీద ఐర్లాండ్‌ 39ఓవర్లలో 133పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సంగ్వాన్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, కౌశల్‌ తలో రెండు వికెట్లు తీయగా, రాజ్‌వర్ధన్‌, రవికుమార్‌, విక్కీ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఓపెనర్‌ హర్నూర్‌సింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement