Sunday, April 28, 2024

CSK : త‌లా విధ్వంసం…సాగ‌ర తీరంలో ధోనీ ఫాన్స్ నీరాజ‌నం…

అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చూసి ఏడాది అవుతోంది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడినా.. ధోనీ బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో మహీ ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆదివారం అభిమానుల ఆశ నెరవేరింది. వైజాగ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.

- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రావడమే కాదు ధనాధన్‌ షాట్లతో అలరించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఆడిన ధోనీ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్‌లో అయితే మహీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 4, 6, 0, 4, 0, 6తో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌లో సింగిల్‌ హ్యాండ్‌తో కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ధోనీ బౌండరీ కొట్టినప్పుడల్లా విశాఖ స్టేడియం దద్దరిల్లింది.

ఎంఎస్ ధోనీ జోరు చూస్తే.. అతను ఒక ఓవర్‌ ముందే బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేదేమో అభిమానులకు అనిపించింది. మహీ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘తలా ఈజ్‌ బ్యాక్‌’, ‘వింటేజ్‌ ధోనీ విధ్వంసం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో మహీ మరిన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు.

రికార్డ్ ల రారాజు…
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 300 వికెట్లలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న మహీ.. ఈ అరుదైన ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు. 300 వికెట్లలో 213 క్యాచ్‌లు, 87 స్టంపింగ్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ, దేశవాళీ క్రికెట్‌లో ధోనీ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ఎంఎస్ ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. పాకిస్తాన్ వెటరన్ కీపర్ కమ్రాన్ అక్మల్ (274), టీమిండియా వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్ (274)లు ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కీపర్ క్వింటన్ డికాక్ (270), ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్ (209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీ 2006 నుండి టీ20 క్రికెట్ ఆడుతున్నాడు. జోబర్గ్‌లో దక్షిణాఫ్రికాపై టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు.

ఎంఎస్ ధోనీ 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించిన విషయం తెలిసిందే. 2008లో ప్రారంభ సీజన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మహీ భాగంగా ఉన్నాడు. ధోనీ చివరిసారిగా 2019లో భారత్ తరపున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. 2024 సీజన్‌కు ముందు 42 ఏళ్ల మహీ.. చెన్నై కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement