Monday, May 20, 2024

కుప్పంలో చంద్ర‌బాబు క్లీన్ బౌల్డ్…మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు: స్వంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో చంద్ర‌బాబు నాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో వైసిపి అత్య‌ధిక పంచాయితీలు కైవ‌సం చేసుకున్న దానిపై పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించడం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనతేనని అన్నారు. ప్రతిపక్ష నేత, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మెజారిటీ సాధించలేకపోయారని, టీడీపీ కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు. కుప్పంలో తాము చేసిన అభివృద్ధే వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను గెలిపించిందన్నారు.

అయ‌న అబ‌ద్దాల‌కు చీత్కారం… చెవిటి భాస్క‌ర‌రెడ్డి
నోరు తెరిస్తే అబద్ధాలు, మాయమాటలు చెప్పే చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని, సొంత నియోజకవర్గ ప్రజలే చంద్రబాబును ఛీ కొట్టారని ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కుప్పంలో చంద్రబాబు అడ్రస్‌ గల్లంతయిందన్నారు. తిరుప‌తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే.. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని, బాబును ప్రజలు మరిచిపోయారన్నారు.

మ‌న‌వ‌డితో ఆడుకో… రోజా..
ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కుప్పం ఎమ్మెల్యే అయిన నారా చంద్రబాబునాయుడికి ఘోర పరాభవం ఎదురైంద‌ని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా చంద్ర‌బాబును తిర‌స్క‌రించార‌ని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా, వాటిలో 4 పంచాయతీలు మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయ‌ని ఇందులో 74 స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుదారులు స‌ర్పంచ్‌లుగా గెలిచార‌ని, కేవ‌లం 14 చోట్ల మాత్ర‌మే టీడీపీ మ‌ద్ద‌తుదారులు గెలిచిన‌ట్లు చెప్పారు. చంద్రబాబును మనవడితో ఆడుకోవడానికి ఇంటికి పంపేశారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వెళ్లి ఏం పీకాడని ప్రశ్నించిన చంద్రబాబును ప్రజలు కుప్పం నుంచి పీకేశారని రోజా వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement