Sunday, April 28, 2024

WTC 2 షెడ్యూలు, పాయింట్ల వివరాలు ప్రకటించిన ఐసీసీ

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మొదటి సీజన్ ఘనంగా ముగిసింది. ఫైనల్ లో టీమిండియా- న్యూజిలాండ్ తలపడగా..కివీస్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే..అయితే ఇక రెండో టెస్ట్ చాంపియ‌న్‌షిప్ పై అన్ని జట్లు దృష్టి సారించాయి. అయితే ఈ సారి నిబంధనలు కొద్దిగా మార్పులను చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇది 2021-2023 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. దీనికోసం కొత్త పాయింట్ల వ్య‌వ‌స్థ‌ను, ఏ టీమ్ ఎన్ని మ్యాచ్‌లు, ఎవ‌రితో ఆడబోతోంద‌న్న షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది.

ఈసారి కేవ‌లం రెండు సిరీస్‌ల‌లో మాత్రం ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక రెండో డ‌బ్ల్యూటీసీలో పాయింట్లు ఎలా ఉండ‌బోతున్నాయో కూడా ఐసీసీ వివ‌రించింది. గెలిచిన టీమ్‌కు 12 పాయింట్లు కేటాయిస్తారు. టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు, ఓడిపోతే 0 పాయింట్లు ఇస్తారు. ఇక ఈసారి స్లో ఓవ‌ర్ రేట్‌కు పెనాల్టీ కూడా విధిస్తున్నారు. అలాంటి టీమ్స్‌కు ఒక పాయింట్ మైన‌స్ చేస్తారు. గ‌తంలో టెస్టుల సంఖ్య‌తో సంబంధం లేకుండా సిరీస్‌కు 120 పాయింట్లు ఇచ్చేవారు. అయితే ఈసారి మాత్రం విజ‌యం సాధిస్తే 12 పాయింట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ చెప్పారు.

ఆగ‌స్ట్ 4 నుంచి ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ప్రారంభం కాబోయే ఐదు టెస్ట్‌ల ప‌టౌడీ ట్రోఫీతోనే రెండో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ప్రారంభం కానుంది. అయితే ఫైన‌ల్ మ్యాచ్ షెడ్యూల్‌, వేదిక‌ను మాత్రం ఐసీసీ ఇంకా రిలీజ్ చేయ‌లేదు. తొలి డ‌బ్ల్యూటీసీలాగే ప్ర‌తి టీమ్ మొత్తం ఆరు సిరీస్‌లు ఆడ‌నుంది. ఇందులో మూడు ఇంట‌, మ‌రో మూడు బ‌య‌ట ఉంటాయి. కొవిడ్ వ‌ల్ల తొలి డ‌బ్ల్యూటీసీలో వాయిదా ప‌డిన సిరీస్‌లు రెండో డ‌బ్ల్యూటీసీలో జ‌ర‌గ‌నున్నాయి.

ఇక రెండో డ‌బ్ల్యూటీసీలో అత్య‌ధికంగా ఇంగ్లండ్ 21 టెస్టులు ఆడ‌బోతోంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో ఇండియా (19), ఆస్ట్రేలియా (18), సౌతాఫ్రికా (15) ఉన్నాయి. ఇక తొలి ఫైన‌ల్ గెలిచిన న్యూజిలాండ్ ఇందులో 13 టెస్టులు ఆడ‌నుంది. ఇండియా ఆడ‌నున్న మొత్తం 19 టెస్టుల్లో సొంత‌గ‌డ్డ‌పై 9, విదేశాల్లో 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: http://సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి బీఓబీ నోటిఫికేషన్‌ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement