Monday, April 29, 2024

Delhi | లిక్కర్ స్కామ్‌పై సుప్రీంను ఆశ్రయిస్తా.. విచారణ వేగవంతం చేయాలని కోరతా : కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణ అనుకున్నంత వేగంగా సాగడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కిలారి ఆనంద్ పాల్ (కేఏ పాల్) అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసుపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. మద్యం కుంభకోణం కేసులో గత 6 నెలలుగా దర్యాప్తు జరుగుతోందని, దాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయాలని కోరడం కోసం తాను సీబీఐ కార్యాలయానికి వెళ్లానని, అయితే ఆదివారం కావడంతో ఉన్నతాధికారులు అందుబాటులో లేరని చెప్పారని కేఏ పాల్ తెలిపారు.

సోమవారం వెళ్లి సీబీఐ ఉన్నతాధికారులను ఇద్దరినీ అరెస్టు చేయాల్సిందిగా కోరతానని ప్రకటించారు. మద్యం కుంభకోణం వెనుక ఎవరున్నారో తెలుసని, ఆలస్యం చేసేకొద్దీ రాజకీయాలు అంటగడతారని పాల్ వ్యాఖ్యానించారు. మనీశ్ సిసోడియాకు నోటీసులు ఇచ్చి, ప్రశ్నిస్తున్నారని.. రేపో మాపో అరెస్టు కూడా చేస్తారని అన్నారు. అయితే కవితను మాత్రం అరెస్టు చేయడం లేదని అన్నారు. అందుకే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నానని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement