Thursday, May 2, 2024

ఉమ్మడి రాష్ట్రంలో కంటతడి.. స్వరాష్ట్రంలో పంటతడి : మంత్రి హరీశ్ రావు

దుబ్బాక : ఉమ్మడి రాష్ట్రంలో నాడు కంట తడి ఉంటే.. నేడు స్వరాష్ట్రంలో పంటతడి ఉన్నది. మీ పొలం వాకిట్లోకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని నర్లెంగడ్డ గ్రామంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో యాసంగిలో పడావు పడి ఉండే పరిస్థితి ఉండేదని, కానీ ఇవాళ సీఎం కేసీఆర్ హయాంలో విత్తనం వేయక ముందే రైతుబంధు వచ్చి మీ బ్యాంకు ఖాతాల్లో పడుతున్నదని చెప్పుకొచ్చారు. నరేండ్లగడ్డ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమైన విషయమని తెలిపారు. తెలంగాణ తల్లిదయతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చారని, ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేస్తే చుక్కనీరు రాని పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీ గ్రామ కాల్వలు, వాగులు మండుటెండలలో నిండి పారుతున్నాయని మంత్రి వివరించారు. రోజుకు 30 కోట్లు వెచ్చించి నెలకు వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్తు కొనుగోలు చేసి రైతులకు నిరంతరం కరెంటు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నరేండ్లగడ్డ గ్రామంలో మహిళా భవనానికి రూ.10 లక్షలు, ముదిరాజ్ భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు, ఉగాది పండుగ తర్వాత ఇళ్ళు మంజూరు చేయిస్తానని మంత్రి హామీనిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement