Sunday, April 28, 2024

ప్రమోషన్లు లేని బదిలీలు మాకొద్దు.. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: పదోన్నతులు లేని బదిలీలు తమకొద్దని ఉపాధ్యాయ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాతే ప్రత్యేక అనుమతి తీసుకొని బదిలీలు చేపట్టాలని ఈమేరకు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. పదోన్నతులు లేకుండా తమకు బదిలీలు చేపట్టొద్దని అధికారుల నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ ప్రకటించిన బదిలీల షెడ్యూల్‌ను వెంటనే వెనక్కి తీసుకొని హైకోర్టు అనుమతి వచ్చాక పదోన్నతులతో కూడిన టీచర్ల బదిలీల ప్రక్రియను పూర్తిస్థాయిలో జరపాలని తపస్‌, టీఆర్టీఎఫ్‌, డీటీఎఫ్‌, ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ఇప్పటికే గత ఎనిమిదేళ్లుగా పదోన్నతులు జరపలేదు. తీరా జరిపేసమయానికి కోర్టు కేసులతో పదోన్నతులకు బ్రేక్‌ పడింది. ఈక్రమంలో పదోన్నతులను ఆపి బదిలీలు చేపట్టడం ద్వారా వచ్చే ఏడాది మార్చిలో పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ పొందేవారికి తీవ్ర నష్టం జరగనుంది. కనీసం వారి సర్వీసులో ఒక్క పదోన్నతిని కూడా పొందకుండానే వీరంతా పదవీ విరమణ చేయనున్నారు.

- Advertisement -

అలాగే టెట్‌ అర్హతను పదోన్నతులలో మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అన్ని ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు టెట్‌ పేపర్‌-2 మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. అలాకాకుండా ఇప్పుడు ఒకవేళ పదోన్నతుల ప్రక్రియ నిర్వహించినట్లయితే ఇప్పటి వరకు నిర్వహించిన బదిలీలలో కూడా దాదాపు 60 శాతం మంది బదిలీ పొందిన స్థానాలకు రిలీవై వెళ్లలేని పరిస్థితి ఉంది.

సెంకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి విడుదల చేసిన షెడ్యూల్‌ను నిలిపివేస్తూ కేవలం మూడవ కేటగిరీ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఎస్జీటీల పదోన్నతులు నిలిపివేస్తూ కేవలం బదిలీలు చేపట్టడం సీనియర్‌ ఉపాధ్యాయులు అనేక విధాలుగా నష్టపోతారని ఆయా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడవ కేటగిరీ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తేనే స్కూల్‌ అసిస్టెంట్‌ల బదిలీలకు ఆటంకంలేకుండా ముందుకు సాగే అవకాశం ఉందన్నారు. ఈనేపథ్యంలో కోర్టు కేసులతో ఏర్పడిన ప్రతిష్టంభనను వెంటనే తొలగించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టి ప్రమోషన్లతో పాటే బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఎస్జీటీల బదిలీల షెడ్యూల్‌ ఇలా…

టీచర్ల పదోన్నతులకు బ్రేక్‌ వేసి కేవలం బదిలీలు మాత్రమే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించి ఈమేరకు ఎస్జీటీల బదిలీ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.అక్టోబర్‌ 3, 4 తేదీలు స్పౌజ్‌ పాయింట్లకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. అక్టోబర్‌ 5న సీనియారిటీ ఫైనల్‌ లిస్టు విడుదల, 6, 7 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. 8వ తేదీన మల్టిdజోన్‌-1లో ఎస్జీటీ, తత్సమానమైన పోస్టులకు, మల్టిdజోన్‌-2లో స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ ఇతర పోస్టులకు బదిలీలు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement