న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హర్యానాలో వరదల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, కుమార్తె విజయలక్ష్మితో కలిసి బుధవారం రాష్ట్రపతి భవన్లో ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి హర్యానాలో వరదల పరిస్థితి, వాటి వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి దత్తాత్రేయను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరదల నియంత్రణతో పాటు నిరుపేదలకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని ఆయన తెలిపారు. రైతులు, శ్రామికులకు అండగా నిలిచినట్టు చెప్పుకొచ్చారు. అనంతరం దత్తాత్రేయ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో భేటీ అయ్యారు. హర్యానాతో పాటు దేశంలోని వివిధ అంశాలపై వారు చర్చలు జరిపారు.