Thursday, May 2, 2024

Big Story | వీడని వాన, హోరెత్తిన వాగులు.. జనజీవనం అస్తవ్యస్తం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. చెరువులు, వాగుల్లోకి నీరు చేరి అలుగు పారుతున్నాయి. వరద ఉద్ధృతికి కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి ముసురు పడుతుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్‌ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుండిగల్‌ మున్సిపాలిటీలోని బహదూర్‌పల్లిలో ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు నదులుగా మారాయి.

రామంతాపూర్‌, ఉప్పల్‌, చిలుకానగర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, పోచారం, ఘట్‌ కేసర్‌, మేడిపల్లి, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వరంగల్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారి ఉప్పల్‌ కూడలి వద్ద భారీగా వర్షం నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్డరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, సమస్యలు ఎదురైతే 94924 09781 నెంబర్‌కు సంప్రదించాలని జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఐడీఎల్‌ చెరువుకు వరద నీరు చేరడంతో పుంతలు తొక్కుతుంది. రసాయనాలు కలుషితాల వల్ల నీటిపై నురగ చేరి తెల్లని పాలపుంతను తలపిస్తోంది. భారీగా గాలి వీస్తుండడంతో జాతీయ రహదారిపైకి నురగ విస్తరిస్తుంది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్‌ నగరం తడిసి ము్దదంది. హనుమకొండలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్ద భారీ వృక్షం నేలకూలడంతో వరంగల్‌ మహానగర పాలక సంస్థ డిజాస్టర్‌ టీమ్ రంగంలోకి దిగి రాకపోకలను పునరుద్ధరించారు. హనుమకొండ జిల్లా పరకాలలో చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఉద్ధృతంగా వరద నీరు చేరుతుంది. పరకాల చలివాగు అలుగు పోస్తుంది.

- Advertisement -

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్‌, పలిమెల, మహా ముత్తారం, కాటరం, మలహర్‌ మండలాల్లో భారీ వర్షం పడుతుంది. వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్‌ బేగంపేట్‌ ప్యాట్నీ ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, అల్వాల్‌, తిరుమలగిరి , చిలకలగూడ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కూడా దెబ్బతిన్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ మండలం ఐనెల్లి వాగు పొంగుతుండడంతో కర్ణాటక రాష్ట్రం చించొల- తాండూర్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కడెం ప్రాజెక్టు వద్ద అంతకంతకూ వరద ఉదృతి పెరుగుతుండడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. అలాగే స్వర్ణ ప్రాజెక్ట్‌ ఒక్క గేటు ఎత్తి నీటిని వదిలారు. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతోంది. సిద్దిపేట జిల్లాలో ఉదృతంగా ప్రవహిస్తున్న కూడవెళ్లి, మోహితుమ్మెద, చిట్యాల వాగులతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు, మంజీరా, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరదనీరు స్థానికంగా ఉన్న దిగువ ప్రాంత గ్రామాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అన్ని ప్రాజెక్టుల వద్ద జలకళ కనిపిస్తోంది. కాళేశ్వరం సమీపంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు పుష్కరఘాట్‌ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్దకు గోదావరి నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వర్షానికి తోడు గోదావరి వరద ఎగపోటు కారణంగా వెంకటాపురం మండలంలోని బల్లకట్టు, కంకలవాగు, జిన్నెలవాగు, పూసువాగు, పెంకవాగులు ప్రమాదకరంగా మారాయి. పలు గ్రామాలకు ప్రవాహాలు అడ్డుగా ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో రాకపోకలు బంద్‌

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో వరద నీటిలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. గోదావరి వరదపోటుతో రహదారులపై వరదనీరు చేరింది. పేరూరు-చండ్రుపట్ల గ్రామాల మధ్యనున్న రహదారిని మరిమాగువాగు ముంచెత్తింది. వంతెనపై వరదనీరు చేరడంతో టేకులగూడెం, పెదగంగారం, చండ్రుపట్ల, కృష్ణాపురం గ్రామాలకు పేరూరుతో సంబంధాలు తెగిపోయాయి. ఏడ్జర్లపల్లి-బొమ్మనపల్లి గ్రామాల మధ్య ఒర్రెలో వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నిలిచిపోయిన ప్రజారవాణా వ్యవస్థ

భూపాలపల్లి, మలహర్‌ మండలం తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాటారం నుంచి మేడారంకు వెళ్లే రహదారి మధ్యలో కేశవాపూర్‌- పెగడపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహాముత్తారం – యమన్‌పల్లి మధ్య గల రోడ్డు తెగిపోయే అవకాశం ఉంది. దొబ్బలపాడు, యామన్‌ పల్లి, దౌత్పల్లి, నిమ్మగూడెం, కేశవపూర్‌, యత్నారం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

అటవీ గ్రామాలను చుట్టుముట్టిన వాగులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ గ్రామాలను వాగులు చుట్టుముట్టాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు చత్తీస్‌గఢ్‌లో పడుతున్న వానలతో మారుమూలగా ఉన్న కొండ వాగులు విరుచుకుపడుతున్నాయి. కలిపాక వాగు, పెదవాగు, పూస వాగు, పెంక వాగుల ప్రవాహంతో మండలంలోని భోదాపురం పంచాయతీ పరిధికి చెందిన సీతారాంపురం, ముత్తారం, తిప్పాపురం పంచాయతీకి చెందిన కొత్త గుంపు, తిప్పాపురం, కలిపాక, పెంక వాగు, గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ కుండపోతగా వర్షం కురుస్తుంది.

సింగరేణికి భారీ నష్టం

వరుణ ప్రతాపానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జనజీవనం ఇళ్ళకే పరిమితమయ్యారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ధరూర్‌ క్యాంపులోని పోలీస్‌ డాగ్‌స్కాడ్‌ ఆఫీస్‌ వద్ద భారీ వృక్షం నేల కూలింది. సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరద నీరు గనుల్లోకి చేరడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌, ఇందారం, కళ్యాణిఖని, రామకృష్ణాపూర్‌, ఖైరిగుడా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రెండు లక్షల 90 వేల టన్నుల మట్టి వెలికితీత పనులను సింగరేణి అధికారులు నిలిపివేశారు. ఒక లక్ష 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు 63వ జాతీయ దారి మార్గంలో అక్కెపల్లి బతుకమ్మ వాగు వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఏడుపాయల క్షేత్రం జలదిగ్బందం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధంలో చిక్కుకుంది. గుడిలోకి భారీగా వరద నీరు చేరింది. ఆలయాన్ని మూసివేసి భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో ఏడుపాయల ఆలయ సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆలయం వైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని కందకుర్తి వద్ద మంజీరా, హరిద్ర, గోదావరి నదులు కలిసే చోటైన త్రివేణి సంగమం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద దాటికి శివాలయం నీట మునిగింది.

గ్రేటర్‌ యంత్రాంగం అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నగర పరిస్థితులను పర్యవేక్షణ బృందాలను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు. ”మరో 2, 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అన్ని స్థాయుల అధికారులు అప్రమత్తంగా ఉండాలి” పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement