Sunday, May 5, 2024

ఇంటర్‌ విద్యలో అనూహ్య మార్పులు.. లాంగ్వేజ్‌లలో నైతిక విలువలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఇంటర్మీడియేట్‌ విద్యలో గణనీయమైన మార్పులు తేవాలని ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయించింది. బోధన ప్రణాళికను సమూలంగా మార్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఇంటర్‌ బోర్డ్‌ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో 111 అంశాలపై చర్చించారు.

ప్రధానంగా ప్రైవేటు కాలేజీల అనుబంధ గుర్తింపు, కోర్సుల్లో తీసుకు రావాల్సిన మార్పులు, పాలనపరమైన ఆలస్యాలను నివారించడంపై సమావేశం దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా కోవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఇంటర్‌ విద్యలో చోటు చేసుకున్న మార్పులపై మంత్రి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

కాలానుగుణంగా మార్పులు

కాలానికి అనుగుణంగా ఇంటర్‌ విద్య కోర్సుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని మంత్రితో సహా, అధికారులూ భావించారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికీ ఇంటర్‌ కోర్సుల్లో సంబంధం లేని సబ్జెక్టులున్నాయని, వీటిని మార్చాల్సిన అవసరం ఉందని ఇంటర్‌ బోర్డ్‌ అధ్యయన నివేదికల్లో వెల్లడైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లోని గ్రూపుల నవీనీకరణకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటర్‌లో ఉండే తెలుగు, హిందీ ఇతర భాషల్లో నైతిక విలువలు పెంపొందించే దిశగా మార్పులు తేవాలని తీర్మానించారు. ఎంఈసీ, ఎంపీసీ గ్రూపులకు ఒకే విధమైన గణిత సబ్జెక్టులున్నాయని, వాస్తవానికి మేథ్స్‌ విద్యార్థులతో సమానంగా ఎంఈసీ విద్యార్థులకు మేథ్స్‌ ఉండాల్సిన అవసరం లేదని బోర్డ్‌ భావించింది.

కామర్స్‌కు ఉపయోగపడే మేథమెటిక్స్‌కు సబ్జెక్టులో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించారు. సీఈసీ గ్రూపులో సివిక్స్‌ కన్నా అకౌంటెన్సీకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్‌ఈసీలో సివిక్స్‌ స్థానంలో పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో లోతైన అవగాహన పెంచేలా మార్పు చేయాలని బోర్డ్‌ ప్రతిపాదించింది.

- Advertisement -

గుర్తింపునకు ఆలస్యమెందుకు?

ప్రైవేటు ఇంటర్మీడియెట్‌ కాలేజీలకు బోర్డ్‌ గుర్తింపు ప్రక్రియ కొన్నేళ్ళుగా విమర్శలకు గురవ్వడంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కాలేజీలు తెరిచి నెలలు గడుస్తున్నా అనుబంధ గుర్తింపు పెండింగ్‌లో పెట్టడం, ఆ తర్వాత అన్ని కాలేజీలకు ఇవ్వడం సర్వసాధారణమైందని సమావేశంలో పలువురు ప్రస్తావించారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో గతంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న విమర్శలపైనా చర్చించారు. వీటన్నింటికీ పరిష్కారంగా కాలేజీలు తెరిచే నాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని, మేలోనే గుర్తింపు ఇచ్చేదీ లేనిదీ స్పష్టంగా తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని బోర్డ్‌ నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసే అదనపు సమయాన్ని అరగంట నుంచి గంటకు పెంచాలని బోర్డ్‌ తీర్మానించింది. వచ్చే ఏడాది నుంచి ఆ్లనన్‌లో జవాబు పత్రాల మూల్యంకనం చేపట్టాలని, తొలుత లాంగ్వేజెస్‌ను ప్రయోగాత్మకంగా మూల్యంకన చేయాలని నిర్ణయించారు.

కాలేజీలు తెరిచే నాటికే పుస్తకాలు : మంత్రి సబిత

ఇంటర్‌ కాలేజీలు తెరిచే నాటికే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండాలని బోర్డ్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. బోర్డ్‌ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పేపర్‌ సకాలంలో అందని కారణంగా పాఠ్యపుస్తకాల ముద్రణ ఈ ఏడాది ఆలస్యమైందని తెలిపారు. వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాలకు టెన్త్‌ పరీక్షలు ముగిసిన వెంటనే ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రైవేటు అనుబంధ గుర్తింపుల విషయంలోనూ ఆలస్యం తగదని సూచించినట్టు తెలిపారు. కొన్ని కాలేజీల కోసం ఈ ప్రక్రియ కొనసాగించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement