Sunday, April 28, 2024

TSRTC | కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్!

హైద‌రాబాద్ : ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీలో నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది.

అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు రేపటి (శనివారం) నుంచి వాడకంలోకి వస్తున్నాయి. వాటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులున్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు జరుగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస రాజు, ఐఏఎస్, రవాణా శాఖ కమిషనర్‌ శ్రీ జ్యోతి బుద్దా ప్రకాశ్, ఐఏఎస్ తోపాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.

హెల్మెట్ల పంపిణీ.. !

హెల్మెట్‌ లేని కారణంగా ఎందరో బైకర్స్‌ దుర్మరణం చెందుతున్నారు. అలా ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో హెల్మెట్‌లను పంచుతున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్లకు చెందిన డి.రమేశ్‌ కుమార్‌. గత వారం రోజులుగా 150 హెల్మెట్‌ లను ఆయన పంపిణీ చేశారు. వ్యవసాయం చేసుకుంటూనే త‌న సొంత డ‌బ్బుల‌తో హెల్మెట్‌లు కొని.. అవ‌స‌రం ఉన్న వారికి పంపిణీ చేస్తుండటం ఆదర్శనీయం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్టీసీ ఎండీ.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement