Wednesday, May 1, 2024

జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ సమస్య..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో నిర్మించతలపెట్టిన జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ సమస్యగా మారింది. రాష్ట్ర్రంలో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందనున్న రోడ్లను గుర్తించి ఆ ప్రాంతాలలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 715 కి.మీ.ల మేర నిడివి గల జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 28,615 కోట్లు వ్యయం కాగలదని ఆ ప్రతిపాదనలలో రాష్ట్రం పేర్కొంది. వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ఎన్‌హెచ్‌-563 పై 68 కి.మీ.ల ఫోర్‌ లేన్‌ రోడ్డు , తొండుపల్లి-కొత్తూరు మధ్య ఎన్‌హెచ్‌హ 44పై 12 కి.మీ.ల రోడ్డు, కొల్లకల్‌-గుండ్లపోచంపల్లి మధ్య ఎన్‌హెచ్‌ 17పై 17 కి.మీ.ల రోడ్డు, జగిత్యాల-కరీంనగర్‌ మధ్య ఎన్‌హెచ్‌ 563పై 59కి.మీ.ల ఫోర్‌ లేన్‌ రోడ్డు, కర్నాటక సరిహద్దు గుడెబెళ్లూర్‌ నుంచి జడ్జర్ల వరకు 90 కి.మీ.ల ఫోర్‌ లేన్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇవి కాకుండా మరి కొన్ని చిన్న రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

- Advertisement -

గత ఏడాది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో ఈ నిర్మాణ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పనులు సాగాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో గత ఏడాదే సంబంధిత రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే, కొన్ని ప్రాంతాలలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. దీంతో ఈ నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. రైతులు వ్యతిరేకిస్తున్న ప్రాంతాలలో భూ సేకరణ ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఈసమస్యను అధిగమించగలిగితే రాష్ట్ర్రంలో జాతీయ రహదారుల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, కర్నాటక సరిహద్దు గుడెబెళ్లూర్‌ నుంచి జడ్జర్ల వరకు 90 కి.మీ.ల ఫోర్‌ లేన్‌ రోడ్డు నిర్మాణంపై కర్నాటక ప్రభుత్వంతో కొంత వివాదం నెలకొంది.

దీంతో ఈపనులు కూడా నత్త నడకన సాగుతున్నాయి. మరోవైపు, వీటితో పాటు కొత్తగా మరో 10 రోడ్ల పనులు ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాట్లు చేస్తున్నది. కీలకమైన హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగంతో పాటు నాగ్‌పూర్‌-విజయవాడ మధ్య కొత్తగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవే కూడా ఉంది. రీజనల్‌ రింగ్‌ రోడ్డు, నాగ్‌పూర్‌-విజయవాడ కారిడార్‌లో భాగంగా తెలంగాణ పరిధిలో మంచిర్యాల నుంచి వరంగల్‌, ఖమ్మం మీదుగా ఏపీ సరిహద్దు వరకు 311 కి.మీ.ల మేర రోడ్డు నిర్మాణం వచ్చే ఏడాదిలోగా పూర్తి కానుంది. మరోవైపు, మంచిర్యాల-ఖమ్మం మీదుగా విజయవాడకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో నాగపూర్‌-విజయవాడ మధ్య దూరం 180 కి.మీ.ల మేర తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మీదుగా ట్రాఫిక్‌ చాలా వరకు ఈ కొత్త రోడ్డు మీదుగా డైవర్ట్‌ అవుతుంది. ఇది కొత్త ప్రాంతాలలో పరిశ్రామిక పురోగతికి దోహదం చేయడమే కాకుండా దూరం తగ్గడంతో ఇంధనం సమయం ఆదా కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement