Friday, May 3, 2024

చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి.. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్, శాసనసభలతో పాటు అన్ని చట్టసభలు తరచూ సమావేశమవుతూ నవభారత నిర్మాణానికి నిర్మాణాత్మక బాటలు వేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. దీనికి తోడు చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని మరింతగా పెంచడం, ప్రజాప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై విస్తృతమైన చర్చలు జరపడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. శాసనసభ సమావేశాలను సరైన సమయంలో నిర్వహిస్తూ, సరైన అంశాలపై చర్చోపచర్చలు నిర్వహించాలన్నారు. ప్రతి సమావేశం తర్వాత నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలని చెప్పారు. దేశ స్వాతంత్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే… మన ఘనమైన ప్రజాస్వామ్య వారసత్వాన్ని మరింత బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేందుకు మహాసంకల్పాన్ని తీసుకోవాలని వెంకయ్య కోరారు. చట్టసభల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ తక్కువగా ఉందని, నిర్మాణాత్మక నిర్ణయాలను తీసుకునే విషయంలో మహిళలలనూ భాగస్వాములను చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మిజోరం అసెంబ్లీ 50వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలకు మిజోరం రాచబాట వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవడంలో ఐదు దశాబ్దాలుగా మిజోరం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. మిజోరం శాంతి ఒప్పందం దీనికి ఒక ఉదాహరణ అన్నారు. శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు జరుగుతున్న పురోగతిని వెంకయ్య నాయుడు అభినందించారు. వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల్లోనూ విశిష్టమైన కృషి జరుగుతోందని, ఇదే అంకితభావాన్ని ఇకపైనా కొనసాగించాలని శాసనసభకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి జోరంతుంగ, స్పీకర్ లార్లిన్ లియానా సైలో, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, అసెంబ్లీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement