ఈ ఆదివారం జరగనున్న చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాక్ మ్యాచ్ కి వానగండం ఉంది. మ్చాచ్ జరిగేది అనుమానమేనని తెలుస్తోంది. టీ 20లో ప్రపంచకప్లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్థాన్తో మెల్ బోర్న్లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు కనపడట్లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ వారమంతా వర్షాలు ఉంటాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అంచనా వేస్తే ఆదివారం జరగాల్సిన హైవోల్టేజి మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వ వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం రోజున మెల్ బోర్న్లో సుమారు 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అది కూడా ఆ రోజున సాయంత్రం తప్పకుండా వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వెబ్సౌట్ ప్రకారం వచ్చే ఆదివారం మెల్ బోర్న్ ఎక్కువశాతం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖాధికారులు తెలియజేశారు. జల్లులు పడే అవకాశం ఉందని వారు తెలిపారు.
సాయంత్రం పూట 15 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెబ్సైట్ సూచించింది. కేవలం ఆదివారం మాత్రమే కాదు శుక్ర, శనివారాల్లో 95 శాతం వర్షం పడవచ్చని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలియజేసింది. ఇండో పాక్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం ఏకధాటిగా కురిస్తే అప్పుడు మ్యాచ్ లేనట్లే అవుతుంది. సెమీస్, ఫైనల్స్కు మాత్రం రిజర్వ్ డేను కల్పించారు.