Friday, June 14, 2024

ప్రధాని మోదీపై క్రేజ్‌ తగ్గింది.. ప్రత్యామ్నాయ శక్తిగా సీఎం కేసీఆర్‌ : మంత్రి గజదీష్‌ రెడ్డి

దేశంలో ప్రధాని నరేంద్రమోదీ క్రేజ్‌ తగ్గిందని, ఇప్పుడు దేశం అంతటా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యామ్నాయ శక్తిగా మారారని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో శనివారం జరిగిన మీట్‌ ది ప్రెస్‌లో మంత్రి జగదీష్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై క్రేజ్‌ తగ్గిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యామ్నాయ శక్తిగా మారారు అన్నారు. దశ,దిశలా కేసీఆర్‌ కీర్త వ్యాపిస్తున్నందున కమలనాథులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఢిల్లీకి కేసీఆర్‌ భయం పట్టు-కుందని, ఆ భయంతోటే ప్రతిపక్షాలను బలహీన పరచే కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలను అస్థిర పరచే కుయుక్తులు చేస్తున్నారని అందులో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అన్నారు. టీఆర్‌ఎస్‌ను నిలువరించే కుట్రలో భాగమే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. తెలంగాణా సంక్షేమ పథకాలు సరిహద్దు రాష్ట్రాలను దాటుతున్నాయని, గుజరాత్‌లోనూ తెలంగాణ పథకాల గురించి చర్చ మొదలైందన్నారు. కుటుంబ స్వార్థం కోసమే రాజగోపాల్‌ రాజీనామా చేశారని, బిజెపి ఎత్తుగడలో ఆయన ఒక పావుగా మారాడన్నారు. మునుగోడుకు కొత్తగా వచ్చింది అమిత్‌ షా, నడ్డా లే, ఉద్యమ కాలం నుండే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మునుగోడు ప్రజలకు సుపరిచితమే అన్నారు. వరద కాలువలే ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారమని, ఆరు ఏండ్లలో ఫ్లోరోసిస్‌ను పారద్రోలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణా సమాజం కోవర్ట్‌ రాజకీయాలను కోరుకోవడం లేదన్నారు. జాతీయ స్థాయిలో బిజెపిని నిలువరించాలన్నదే వామపక్షాల అభిమతం అని, మునుగోడులో మద్దతు అందులో భాగమే అన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యమని, రెండోస్థానం కోసమే కాంగ్రెస్‌, బిజెపిలు పోటీ- పడుతున్నాయి మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement