Thursday, May 2, 2024

TS: పారిశ్రామికవేత్త‌ల‌కు తెలంగాణ భూత‌ల స్వ‌ర్గం.. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

హైద‌రాబాద్ : పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గం అని తెలిపారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. దేశంలో ఎక్కడా లేని మౌలిక వసతుల కల్పనకు మంచి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నెలకొందన్నారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ అంటేనే నా రాష్ట్రం.. నా ఊరు అన్న భావన ఇక్కడ కలుగుతుందన్నారు. ప్రపంచానికి అద్భుతమైన మానవ వనరులను అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఇవాళ జరిగిన సిఐఐ తెలంగాణ స్టేట్ అన్యువల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు.

మ‌హిళ‌ల‌ను మ‌హాల‌క్ష్మిగా చూసే ప్ర‌భుత్వం మాది..

తెలంగాణలోని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా చూస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో మహాలక్ష్మి పథకం కింద మహిళలు అందిస్తున్న ఉచిత బస్సు రవాణాను ఇప్పటి వరకు 18.50 కోట్ల మంది మహిళలకు జీరో టికెట్స్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు.

- Advertisement -

డెయిరీ ప‌రిశ్ర‌మ‌లు స్థాపించండి..

రాష్ట్రంలో పాల ఉత్పత్తికి వినియోగం మధ్యన చాలా గ్యాప్ ఉంద‌ని, దీంతో డెయిరీ ని డెవలప్ కు తెలంగాణాలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛమైన పాలను అందించగలిగే విధంగా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తుకు మేలు చేసిన వారం అవుతామని తెలిపారు. అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనువుగా ఉన్న చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు.

వ్య‌వ‌సాయ అనుబంధ సంస్థ‌ల‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ..

మొక్కజొన్న, టమాట, మిర్చి, పత్తి తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించవచ్చని తెలిపారు. వాణిజ్య పంటల ఉత్పత్తి ద్వారా రైతులు ఆర్థికంగా బలపడటంతో పాటు పరిశ్రమల యజమానులు సైతం ఆదాయం పొందవచ్చన్నారు. గోదావరి కృష్ణ నదులను మూసీకి అనుసంధానం చేసి స్వచ్ఛమైన నీరు పారే విధంగా మూసీ ప్రక్షాళన చేయబోతున్నామన్నారు.

మూసీన‌ది ప‌రివాహ‌క ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి..

మూసీ పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, ఫ్లై ఓవర్స్, ఎంటర్టైన్మెంట్, బోటింగ్ తదితర ఎసెట్స్ ను పిపిపి మోడల్ లో అభివృద్ధి చేయనున్నామని భ‌ట్టి చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో మూసీ రివర్ డ్రైనేజీగా మారింద‌న్నారు. ఔటర్ రింగు రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ మధ్యన అనేక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఒకే చోట ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసి 3000ఎకరాల్లో అనేక చోట్ల ఫార్మా విలేజ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

గ్రానైట్ క్ల‌స్ట‌ర్లు ఏర్పాటు చేస్తున్నాం..

ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన టెక్స్టైల్ గ్రానైట్ ఐటి సెక్టార్ మైన్ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. పెరిగిన ధరలతో హైదరాబాదులో సామాన్యులు పేద మధ్యతరగతి ప్రజలు ఇంటి స్థలం కొనే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వాలు హైదరాబాదులోని బర్కత్ పుర, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

విద్యావ‌న‌రులు అధికంగా ఉన్న ఏకైక రాష్ట్రం ..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఐఐటి లాంటి విద్యాసంస్థలు మానవనరులను హైదరాబాదులో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. హైదరాబాదుకు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలకు కావలసినంత భూమి తెలంగాణలో అందుబాటులో ఉందన్నారు. హైదరాబాదు నగర రాజ్యాంగ అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement