నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీపై తీన్మార్ మల్లన్న మరోసారి స్పష్టత ఇచ్చారు. ఈ ఎన్నికలో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. అటు కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన కూడా తనకు లేదని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో నిర్వహించిన సభలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ సభకు భారీగా మల్లన్న అనుచరులు తరలివచ్చారు.
త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా 6వేల కి.మీ. పాదయాత్ర చేస్తానని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. తీన్మార్ మల్లన్న టీమ్ పేరిట రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఇటీవల నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి తీన్మార్ మల్లన్న మంచి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.