Sunday, May 19, 2024

టాటా నుంచి మరో 4 ఈవీ కార్లు..

ప్రముఖ ఆటో వాహన కంపెనీ టాటా మోటార్స్‌ ఈ సంవత్సరం కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకు రానుంది. టాటా మోటార్స్‌తో పాటు దాని అనుబంధ జగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) బ్రాండ్‌ పై కూడా కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకు రానుంది. వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి మరో 4 కొత్త విద్యుత్‌ కార్లను తీసుకురావాలని టాటా మోటార్స్‌ నిర్ణయించింది. వాణిజ్య వాహనాల విభాగంలో హైడ్రోజన్‌ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

త్వరలోనే అప్‌డేట్‌ చేసిన నెక్సాన్‌ కారును కూడా మార్కెట్‌లోకి తీసుకురానుంది. అప్‌డేట్‌ నెక్సాన్‌ ఈవీ మార్కెట్‌లోకి తీసుకు వచ్చిన వెంటనే హారియర్‌ విద్యుత్‌ కారును లాంచ్‌ చేయనుంది. ఈ సంవత్సరమే పంచ్‌ ఈవీ కారు కూడా మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు టాటా మోటార్స్‌ నిర్ణయించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో టాటా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కర్వ్‌ ఈవీ కారు కూడా మార్కెట్‌లోకి తీసుకు వస్తామని కంపెనీ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ వెల్లడించారు.

ఈ సంవత్సరం చివరి నాటికి రేంజ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్ విద్యుత్‌ కార్ల బుకింగ్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. జాగ్వార్‌ ఈవీ కార్లను 2024లో మార్కెట్‌లోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. కమర్షియల్‌ వాహనాల్లో సీఎన్జీ వెర్షన్‌లో కొన్ని కొత్త వాటిని మార్కెట్‌లోకి తీసుకు వస్తామన్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్‌ నెక్సాన్‌, టిగోర్‌, టియాగో బ్రాండ్స్‌లో విద్యుత్‌ కార్లను విక్రయిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement