Friday, April 26, 2024

Cricket: పాక్‌ కెప్టెన్‌ను వెనక్కి నెట్టేసిన సూర్యకుమార్‌.. టీ20లో అద్భుత ఇన్నింగ్స్‌

ఐసీసీ తాజా టీ 20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను అధిగమించి మూడో ర్యాంకును చేరుకున్నాడు..ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన మొదటి టీ 20లో అతడు అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన అనంతరం ఈ ఘనత సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో 25 బంతులు ఎదుర్కొన్న సూర్య.. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు సాధించాడు.

ఇక పాక్‌ ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (825) నెంబర్‌ వన్‌ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్‌ మార్‌ క్రమ్‌ (792) 2వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలన్‌, ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ 5,6 స్థానాల్లో ఉన్నారు. ఇక మరే ఇతర బ్యాటర్‌ కూడా టాప్‌ 10లో లేరు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ 14, 16, 18వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

భారత టీ 20 లీగ్‌లో చూపించిన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత్‌ ఆల్‌ రౌండర్‌ హార్థిక్‌ పాండ్య దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేయడంతో ఆల్‌ రౌండర్ల జాబితాలో టాప్‌-5లో దూసుకు వచ్చాడు. రెండు స్థానాలు ఎగబాకి 180 ర్యాకింగ్‌ పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. షకిబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌), మహమ్మద్‌ నబి (అప్ఘనిస్తాన్‌ ) ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.

అయితే బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌ రెండు స్థానాలు పడిపోయి 9వ స్థానంలో నిలిచాడు. మరే ఇతర భారత బౌలర్‌ కూడా టాప్‌ 10లో చోటు సంపాదించలేకపోయారు. జోష్‌ హేజిల్‌ వుడ్‌ (ఆస్ట్రేలియా), తబ్రిక్‌ షంసి (దక్షిణాఫ్రికా) మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement