Sunday, April 28, 2024

Supreme Court: ఎన్నికల బాండ్ల కేసు: ఎస్‌బీఐ విజ్ఞప్తి తిరస్కరణ.. రేపటిలోగా వివరాలివ్వాలి..

ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో.. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువు పొడిగించే ప్రసక్తే లేదని చెబుతూ రేపటిలోగా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఎస్‌బీఐకి స్పష్టం చేసింది. అలాగే.. మార్చి 15 లోగా బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీని ఆదేశించింది. ఇక.. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపే టైంలోఎస్‌బీఐ వాదనలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాతల వివరాల్ని సరిపోల్చుకోవడానికి సమయం పడుతుందని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఎస్‌బీఐ వాదన వినిపించింది. అయితే గత 26 రోజులుగా ఏం చేశారని బెంచ్‌ ఈ సందర్భంగా ఎస్‌బీఐని ప్రశ్నించింది.

గత నెలలో రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్‌ బాండ్‌లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలంటూ ఎస్‌బీఐని ఆదేశించింది. అదే సమయంలో వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈనెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది కూడా. ఆపై ఆ సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌ ద్వారా ఈనెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టంచేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement