Monday, April 29, 2024

మెడికల్ కళాశాల నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభించండి – జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ ప్రతినిధి,భూపాలపల్లి : మెడికల్ కళాశాల నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఉద్దేశించిన ఘనపూర్ మండలం సింగరేణి తౌజెండ్ కోటర్స్ సమీపంలో 134 సర్వేనెంబర్లో సింగరేణి ఆధీనంలో గల 17 ఎకరాల భూమిని సింగరేణి, రెవెన్యూ, టీఎస్ ఎంఎస్ ఐడిసి అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …జిల్లాలో మెడికల్ కళాశాల ఆవశ్యకతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లాలో అన్ని రకాల ఉచిత వైద్యసేవలు పేద ప్రజలకు అందుబాటులోకి రానున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కళాశాల ఏర్పాటుకు అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉంది కాబట్టి మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి వెంటనే కార్యాచరణ సిద్ధం చేయాలని టీఎస్ ఎంఎస్ ఐడిసి రవి కిరణ్ ను ఆదేశించారు. ఇదే సర్వే నెంబర్లో ప్రభుత్వం సింగరేణి సంస్థకు అందజేసిన మరో 18 ఎకరాల భూమిలో ప్రస్తుతం ఎవరు కాస్తులో ఉన్నారో వివరాలు సేకరించి అందించాలని ఘనపూర్ తాసిల్దార్ సతీష్ కుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం శ్రీనివాసరావు, ఎస్టేట్ ఆఫీసర్ బాబుల్ రాజ్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement