హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండో చిన్న రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ఎస్ఎస్ల్వీ-డీ 2 రాకెట్ మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకు వెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు నమోదు చేయనుంది. మొబైల్ సర్వీసు టవర్ నుంచి రాకెట్ను ముందుకు తీసుకెళ్లి మళ్లీ వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలించారు. బ్రహ్మ ప్రకాశ్ హాలులో వాహన సంసిద్ధత సమావేశంలో సంతృప్తి ప్రకటించారు. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం అధ్యక్షతన సమావేశమైన లాంచ్ అథరైజేషన్ బోర్డు దాదాపు 6.30 గంటల పాటు కౌంట్ డౌన్ నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే శ్రీహరికోటలోని ప్రథమ ప్రయోగ వేదిక మీద సిద్ధంగా ఉన్న రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-07, దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించిన 8.7 కిలోల బరువు గత ఆజాదీశాట్-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్-01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. అంతకు ముందు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ రాకెట్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఇస్రో శాస్త్త్రవేత్తలు పలు కీలక పరీక్షలు నిర్వహించి ఎస్ఎస్ఎల్వీ-డి2 రాకెట్ను సిద్ధం చేశారు.