హైదరాబాద్, ఆంధ్రప్రభ: దక్షిణ తెలంగాణకు జీవధారగా ఆవిష్కృతం కానున్న పాలమూరు రంగారెడ్డి బహుళార్ధక సాధక ఎత్తిపోతల ప్రాజెక్టు మొదటి దశ భూఉపరితల నిర్మాణ పనులు పూర్తి చేసుకుని భూగర్భంలోని పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ఆగస్టు చివరినాటికి 16 నియోజకవర్గాలకు సాగు నీరందించే లక్ష్యంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.74 మీటర్ల లోతు వరకు నిర్మించిన సర్జిఫూల్ తో పాటుగా భూగర్భంలో విశాలంగా ఏర్పాటు చేసిన పంపింగ్ వ్యవస్థకు మోటర్ల బిగింపు పునులు పూర్తి అవుతున్నాయి. ఇప్పటివరకు చరిత్ర సృష్టించిన కాళేశ్వరం బాహుబలిపంపులు, భూగర్భంలో ఏర్పాటుచేసిన పంపు హౌస్ లను మించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పంపులు బిగిస్తున్నారు.
సముద్రమట్టానికి 269.735 మీటర్ల ఎత్తులోని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దశలవారిగా 70 టీఎంసీల నీటిని 5 దశల్లో ఎత్తిపోసి భారీజలాశయాలను నింపడం ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ లో అద్భుతం. అయితే ఎత్తిపోసిన కృష్ణా నది జలాలను సర్జీపూల్ నుంచి సముద్రమట్టానికి 670 మీటర్ల ఎత్తులోకి ఎత్తిపోస్తూ జలాశయాలను నింపడం మరో అద్భుతం. ఇప్పటివరకు కాళేశ్వరం జలాలు సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులోకి ఎత్తిపోస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ ను నింపుతుంది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 670 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయనుండటంతో దేశంలో ఈ ప్రాజెక్టు చరిత్ర సృష్టించడంతో పాటుగా ప్రపంచరికార్డును సొంతం చేసుకునే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి.
కొండలను సరిహద్దులుగా చేసి జలాశయాలు నిర్మించిన కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేసి భూగర్భంలో పంపుహౌస్ లతో పాటుగా 74 మీటర్లు కిలోమీటర్ల లోతున సర్జిఫూల్ నిర్మించి కాకతీయుల చరిత్రను తెలంగాణ ప్రభుత్వం అధిగమిస్తోంది. మొదటి దశలో తాగునీటి అవసరాలకోసం 8.51 టీఎంసీల సామర్ధ్యంతో అంజనగిరి(నార్లాపూర్, 16.74 టీఎంసీ వట్టెం( వెంకటాద్రి),15.61,టీఎంసీల సామర్ధ్యంతో ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి.
ఈ రిజర్వాయర్ల ద్వారా 16 నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 చెరువులు, కుంటలకు నూరు అందగా 1226 గ్రామాలకు తాగునీటి సౌకర్యం ఏర్పడనుంది. ఈ రిజర్వాయర్ల పనుల్లో భాగంగా ఇప్పటివరకు 62.21 కీలోమీటర్ల భూగర్భ సొరంగం, 50 కిలో మీటర్ల మేరకు భూఉపరితల కాలువల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఉపరితల పనులు దాదపుగా పూర్తి కావడంతో ప్రస్తుత వర్షాలను అధిగమిస్తూ భూగర్భంలో ఇప్పటికే నిర్మాణ పూర్తి అయిన పంపుహౌస్ ల్లో విద్యుత్ సరఫరా, భారీబాహుబలి పంపుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 145 మెగావాట్ల సామర్ధ్యంతో ఒట్టెం, ఎ దుల లో 10 పంపులకు 3 పంపులు, నార్లపూర్ పంపుహౌస్ కోసం 2 పంపుల బిగింపుపూర్తి కాగా మిగతాపంపులు బిగించి ఆగస్టు నాటికి తాగునీరు అందించే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
గడువు లోగా పనులు పూర్తి : చీఫ్ ఇంజనీర్ అమీద్ ఖాన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు గడువులోగా పనులు పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచినట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అమీద్ ఖాన్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ పనులు చేస్తున్నట్లు ఆంధ్రప్రభ అడిగిన ప్రశ్నలకు స్పందించారు. కాళేశ్వరం మోటర్లు 139 మెగావాట్ల సామర్ధ్యంతో ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జలాశయాల్లో 145 మెగావాట్ల మోటర్లు బిగిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి రంగంలో ఈ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుందన్నారు. ఉపరితల పనులు దాదపుగా పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో భూగర్భంలో పనులు కొనసాగుతున్నాయన్నారు. వర్షాలు కురిసినా పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉత్పన్నం కావని ఆయన చెప్పారు.