హైదరాబాద్, ఆంధ్రప్రభ: పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చొరవతో నూతన ”ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్” పాలసీని ప్రభుత్వం ఆవిష్కరించింది. ఆసుపత్రుల్లోని బెడ్ ఒక్కంటికి నెలకు చేసే పారిశుద్ద్య ఖర్చును రూ.7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూళ్లకు వర్తింపజేస్తూ తాజాగా జీవో 31 ను విడుదల చేసింది. ఆసుపత్రుల్లోని పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది నమోదైన బెడ్ ఆక్యుపెన్సీ లేదా మంజూరైన పడకల సంఖ్య వీటిలో ఏది ఎక్కువ అయితే దాని ఆధారంగా రికనబుల్ బెడ్ స్ట్రెంత్ను నిర్ణయించాలి. ఇప్పుడు ప్రతి 7000 స్క్వేర్ ఫీట్ల బిల్డప్ ఏరియాకు ఒకరిని, ఓపెన్ ఏరియా అయితే 27,000 స్క్వేర్ ఫీట్ కు ఒక పారిశుధ్య కార్మికుడిని నియమించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది.
మెడికల్ కాలేజీలకు వర్తించే ఈ విధానాన్ని., నర్సింగ్ కాలేజీలకు, నర్సింగ్ పాఠశాలలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. కొత్త పాలసీ ప్రకారం 200 ఆపై పడకల్ ఉన్న దవాఖానకు ప్రత్యేకంగా టెండర్లు పిలువాల్సి ఉంటుంది. 200 లోపు పడకలు ఉన్న హాస్పిటల్లకు వీలైనంత వరకు కలిపి టెండర్లు పిలువాలని నిబంధనల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ టెండర్లను జిల్లా స్థాయిలో నిర్వహిస్తుంది. జిల్లా ఆరోగ్య సంఘం ఐహెచ్ఎఫ్ఎంఎస్ ఏజెన్సీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. పారిశుద్ధ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలను పాటించేలా కార్మికులకు నైపుణ్యం పెంపుదలలో ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సహాయాం చేస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..