Thursday, May 16, 2024

Sonia Gandhi | ప్రత్యక్ష రాజకీయాలకు సోనియా గాంధీ దూరం.. !

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ బరి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నిక కానున్నట్లు పార్టీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ తప్పుకోనున్నారు.

ఇక ఆ స్థానంలో సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దించాల‌ని హస్తం పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. రాజస్థాన్‌ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ.. వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొనే పరిస్థితిలో లేని కారణంగానే ఆమెను రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది.

ఇక 2019 జనవరిలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ.. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ.. తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర్‌ప్రదేశ్‌ ఇంఛార్జ్‌గా నియమించారు. ఈ క్రమంలోనే రాయ్‌బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ తప్పుకోనుండటంతో.. 2024 ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement