Sunday, April 28, 2024

Big Story: సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రాణం ఉన్న మిషన్లు.. 10మందిలో ఏడుగురికి తీవ్ర అనారోగ్యం

ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : భారత్‌లో సాఫ్ట్‌వేర్‌, ఐటీ రంగాల ఉద్యోగులు అంచెలంచెలుగా ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం బయట ప్రపంచంలో ప్రచారం జరుగుతున్న స్థాయిలో వాస్తవానికి వారికి జీతభత్యాలు లభిం చడం లేదు. అదికాక పగలూరాత్రీ షిఫ్ట్‌ల్లో మిష న్లుగా పని చేయిస్తున్నారు. సాధారణంగా సాప్ట్‌ వేర్‌ ఉద్యోగాలంటే కంప్యూటర్లు, కాన్ఫరెన్స్‌లు, కెఫ్టేరియాలు, వీకెండ్‌ పార్టీలన్న భావముండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా ఐటీ ఉద్యోగు లు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమౌ తున్నారు. తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహిం చిన సర్వేలో ప్రతి పదిమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగు ల్లో ఏడుగురి కండరాలు అత్యంత బలహీనంగా ఉన్నట్లు తేలింది.

ఆహారపుటల వాట్లు, మారిన జీవన శైలి, ప్రొటీన్లు సమృద్ధిగా తీసుకోకపోవ డం, సరైన వ్యాయామాలు లేకపోవడమే ఇందు క్కారణంగా గుర్తించారు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో అత్యధికులు ఇప్పుడు సుగర్‌, బీపీ, అల్సర్‌ వంటి సమస్యలతో సతమతమౌతున్నారు. ప్రతి పది మందిలో నలుగురు వెన్ను సంబంధిత వ్యాధు లతో ఇబ్బందిపడుతున్నారు. అలాగే ప్రతి పది మందిలో ఇద్దరికి మానసిక పరిస్థితుల్లో మార్పు లొచ్చినట్లు గుర్తించారు. అన్నింటికి మించి వీరికి భవబంధాలతో సంబంధాలు తెగిపోయాయి. పరిసర పరిజ్ఞానం కొరవడింది. సమాజంలో, దేశంలో, ఆఖరకు కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై కూడా అవగాహన లేకుండా పోతోంది.

సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే చేరగానే ఆరంకెల మొత్తంలో జీతముంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇలా.. ఆరంకెల జీతాన్ని పొందగలిగే నిపుణులు కొందరు మాత్రమే. మొత్తం ఉద్యోగుల్లో 15శాతానికి లోబడే ఏడాదికి 12లక్షలకు పైబడ్డ వేతనాల్ని పొందుతున్నారు. పైగా ఈ సంస్థల్లో అత్యధికంగా అమెరికాలో కేంద్ర కార్యాలయాల్ని నిర్వహిస్తున్నాయి. దీంతో అక్కడి ఆదాయపు పన్ను నిబంధనలకనుగుణంగా వీరి జీతభత్యాల్లో కోతలు పడుతున్నాయి. కొవిడ్‌ అనంతరం వీరి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వేతనాలు పెరగకపోగా రోజూ అదనంగా పుని చేయాల్సి వస్తోంది. ప్రతి ఏటా చివర్లో ఐటీ కంపెనీలు ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంటాయి. ఇందులో ఉద్యోగులకు రేటింగ్‌ ఇస్తుంటాయి.

అందుకనుగుణంగా కొందర్ని తప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ భయం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. జీతాల పెంపు లేకున్నా కనీసం ఉద్యోగం నుంచి తొలగించొద్దంటూ పలువురు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు తమ సంస్థల్ని ప్రాధేయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్‌లో ఐటీ, ఈసీఈ విభాగ విద్యార్థులతో పాటు ఇతర విభాగాల్లో పూర్తి చేసిన వారు కూడా ప్రత్యేక తర్ఫీదు పొంది గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం వెంపర్లాడేవారు.

ఇప్పుడు ఈసీఈ ఇంజనీరింగ్‌ పట్టభద్రులు కూడా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెడుతున్నారు. గత కొంతకాలంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను వదిలి వ్యవసాయం, ఇతర వ్యాపారాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణగా కర్మాగారాల్లో ఓ గంట అదనంగా కార్మికులు పనిచేస్తే దేశంలో పలు ఉద్యమాలు జరిగాయి. కానీ కార్పొరేట్‌ దిగ్గజాలైన సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఇప్పుడు రోజూ 12నుంచి 14గంటలు పని చేయిస్తున్నారు. ఒకప్పుడు శని, ఆదివారాల్లో వీరికి సెలవులుండేవి. కానీ ఇప్పుడా రెండ్రోజులు వీడియో కాన్ఫ రెన్స్‌లు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఐటీ ఉద్యోగులంటే ఒకప్పుడు మేథావులుగా పరిగణించేవారు.

- Advertisement -

కానీ ఇప్పుడు మరే ఉద్యోగాల్లేక ఈ రంగంలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగికి పిల్లనివ్వడాన్ని ఒకప్పుడు హోదాగా పరిగణించేవారు. తమ పిల్లలు లేదా అల్లుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అంటూ గొప్పగా చెప్పుకునేవారు. పెళ్ళికూతుళ్ళు కూడా సాఫ్ట్‌వేర్‌ సంబంధాల కోసం ఎగబడేవారు. దేశంలోనే కాదు.. విదేశాల్లో స్థిరపడేందుకు కూడా పోటీలు పడేవారు. రాన్రాను ఈ పరిస్థితి మారుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రోగగ్రస్తులవుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలకు లోనవు తున్నారు. వీరిలో అంధత్వపు శాతం కూడా అధికంగా ఉంది. గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చుంటున్న కారణంగా వీరిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement