చార్ధామ్ యాత్ర అంటే జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఈ యాత్ర ఎంతో రిస్క్ తో కూడుకున్నది అయినప్పటికీ ప్రతి ఏటా యాత్రికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుతూ వస్తోంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమై రెండు నెలలు పూర్తి కాకముందే ఇప్పటి వరకు 203 మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్ధామ్ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది. అయితే రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. వీరిలో కేదార్నాథ్ యాత్ర మార్గంలో 97 మంది, బద్రీనాథ్ ధామ్ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది ఉన్నారని తెలిపింది.
గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నది. మే 3 నుంచి ఇప్పటివరు 25 లక్షల మందికిపైగా యాత్రికులు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని వెల్లడించింది. అయితే వాతావరణంలో మార్పులు, వర్షాలు పడుతుండటంతో గత వారంరోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కాగా, యాత్రకు రావడానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచించింది.