Monday, April 29, 2024

Delhi | సింగరేణి బొగ్గు బ్లాక్‌లను ఎవరికీ కేటాయించలేదు.. ఎంపీ నామా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆన్సర్​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలు కేటాయించడం వాస్తవం కాదా ? ఇప్పటివరకు సింగరేణి కంపెనీకి చెందిన ఎన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించారు ? సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించే ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారా? అని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం రాతపూర్వక సమాధానమిచ్చారు.

బొగ్గు గనుల చట్టం ( ప్రత్యేక నిబంధనలు ) – 2015లో నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బొగ్గు గనులు కేటాయింపుదారుని ఎంపిక చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. మైన్స్, మినరల్ చట్టంలోని నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాకుల కేటాయింపునకు ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంతో ముందస్తుగా ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని నామా విస్మయం వ్యక్తం చేశారు.

రామగుండం సభలో ప్రధాని సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించడం లేదని చెప్పి, ఆ తర్వాత సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణకు పూనుకోవడంతో తెలంగాణ సమాజం నిరసనతో ఎదురు తిరిగిందని గుర్తు చేశారు. సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయని నామ స్పష్టం చేశారు. లక్షలాది మంది సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్నారని, అటువంటి సంస్ధను దొడ్డిదారిన ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని, ఈ విషయంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని నామా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement