Monday, May 27, 2024

మాధురీ జైన్‌కు షాక్‌, భారత్‌ పే నుంచి తొలగింపు..

భారత్‌ పే ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు ఫిన్‌టెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అష్నీర్‌ గ్రోవర్‌ భార్య మాధురీ జైన్‌ గ్రోవర్‌కు కంపెనీ బోర్డు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆమెను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కంపెనీ కంట్రోలర్‌ హోదాలో మాధురి, ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. మాధురీ జైన్‌.. కంపెనీ డబ్బులతో.. బ్యూటీ ప్రోడక్టులు కొనుగోలు చేయడంతో పాటు దుస్తులు, ఎలక్ట్రిక్‌ సామాగ్రి, అమెరికా, దుబాయ్‌కు ఫ్యామిలీ ట్రిప్‌ వేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అల్వరెజ్‌ అండ్‌ మార్షల్‌ కంపెనీ నిర్వహించిన దర్యాప్తులో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యాయి. దీంతో మాధురీని కంపెనీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఫేక్‌ ఇన్‌వాయిస్‌లతో కంపెనీని ఆమె చేయాలని ప్రయత్నించినట్టు విచారణలో తేలింది.

అంతర్గత విచారణలో వెల్లడి..

ఫిన్‌టెక్‌ రంగంలో భారత్‌ పే సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన మాధురీ భర్త అష్నీర్‌ గ్రోవర్‌ ఈ ఆరోపణలు ఖండిస్తూ వచ్చారు. అవినీతి ఆరోపణలు వినిపించడంతో.. అష్నీర్‌ను సెలవుల మీద పంపించి.. అంతర్గత విచారణ ద్వారా ఆయన్ను తప్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే గ్రోవర్‌ మాత్రం ముందు నుంచి ఓ డిమాండ్‌ కంపెనీ ముందు ఉంచుతూ వచ్చారు. తాను కంపెనీ వీడాలంటే.. తన వాటాగా ఉన్న రూ.4వేల కోట్లు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తన నాయకత్వంలోనే కంపెనీ ముందుకు వెళ్లాలని చెబుతున్నాడు. సుమారు 3 బిలియన్‌ డాలర్లు విలువ చేసే భారత్‌ పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీఓకు వెళ్లే ఆలోచనలో ఉంది. ఈ లోపు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది.

ఫేక్‌ ఇన్‌వాయిస్‌లతో బురిడీ..

కొటక్‌ మహీంద్రా బ్యాంకు సిబ్బందిపై అసభ్య పదజాలాన్ని వాడారనే ఆరోపణలతో పాటు భారత్‌ పేలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ గ్రోవర్‌ దంపతులపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం భార్య భర్తలు ఇద్దరూ.. దీర్ఘ కాల సెలవుల్లో ఉన్నారు. మాధురి గ్రోవర్‌.. సంస్థకు సంబంధించిన అత్యంత రహస్య విషయాలు కూడా తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారనే ఆరోపణలు నిజం అయ్యాయి. ఆ సమాచారాన్ని ఉపయోగించి.. మాధురి తండ్రి, సోదరుడు నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించారని ఆడిట్‌లో స్పష్టమైంది. ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌తో పాటు గతేడాది ఏప్రిల్‌లో ముఖానికి చేసుకున్న బ్యూటీ ట్రీట్‌మెంట్‌కు డబ్బులు కంపెనీ ఖాతా నుంచే చెల్లించినట్టు స్పష్టమైంది. వ్యక్తిగత సిబ్బంది జీతాలు కూడా కంపెనీ నిధుల నుంచే చెల్లించట్టు తేలింది. 2018 నుంచి ఆమె కంపెనీ ఫైనాన్షియల్‌ ఇన్‌ఛార్జీగా ఉన్నారు. మంగళవారమే మాధురీని పదవుల నుంచి తొలగించినట్టు కంపెనీ అధికార ప్రతినిధి బుధవారం ప్రకటించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement