Monday, April 29, 2024

మునుగోడు ఎన్నిక తర్వాత వరుస నోటిఫికేషన్లు.. గ్రూప్‌-2, గ్రూప్‌-4, ఇతర నోటిఫికేష్లకు టీఎస్‌పీఎస్సీ రెడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వెలువడనున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నోటిఫికేషన్లు విడుదలచేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ఆ దిశగా కసరత్తులు చేపడుతోంది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఉండడం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో కొత్తగా నోటిఫికేషన్లకు కాస్త బ్రేకులు పడినట్లుగా తెలుస్తోంది. అయితే మునుగోడు ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో ఇక నోటిఫికేషన్లు వేసేందుకు అటు ప్రభుత్వం, ఇటు టీఎస్‌పీఎస్‌సీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆ తర్వాత ఎప్పుడైనా గ్రూప్‌-2 లేదా గ్రూప్‌-4, ఇతర నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడు నాలుగు నెలల గ్యాప్‌తో వరుసగా గ్రూప్‌-2, 4తో పాటు మిగతా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్‌సీ ప్రణాళికలు రచిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఆర్థికశాఖ అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య దాదాపు 53వేల వరకు ఉంది. ఇందులో దాదాపు 21500 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ, పోలీస్‌రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్లు ఇప్పటికే ఇచ్చేశాయి. పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష పూర్తి కాగా, ఇంకా ఈవెంట్స్‌ జరగాల్సి ఉంది. అలాగే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ఇంకా జరగాల్సి ఉంది. ఆర్థికశాఖ అనుమతులు పొందిన గురుకుల…, గ్రూప్‌ 2, 3, 4 ఇతర నోటిఫికేషన్లు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గిరిజనులకు 10 శాతానికి రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయండంతో దానికనుగుణంగా రోస్టర్‌ పాయింట్ల వారీగా పోస్టులను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.

- Advertisement -

ఎదురుచూపులు…

80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన దానిప్రకారం 53 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చినా నోటిఫికేషన్లు మాత్రం ఆలస్యంగా వెలువడుతున్నాయి. ఒక్కో నోటిఫికేషన్‌కు మధ్య చాలా గ్యాప్‌ ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే నిరుద్యోగులు మాత్రం ఆలస్యంగా నోటిఫికేషన్లను జారీ చేయడం ద్వారా నిరాశకు గురవుతున్నారు. సెప్టెంబర్‌ నెలలో ఏదైనా ఓ భారీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని నిరుద్యోగులు భావించారు. లేదా దసరా పండుగ ముందైనా విడుదల చేస్తారని నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వెలువడలేదు. ఆర్థిక శాఖ శాఖల వారీగా పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ వస్తున్నది.

పోలీస్‌ రిక్య్రూట్‌మెంట్‌ బోర్డు అధ్వర్యంలో 17వేల పైచిలుకు పోస్టులు, టీఎస్‌పీఎస్‌సీ దాదాపు 2600 ఉద్యోగాలు, ఇతర పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇంకా సుమారు 31 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఇటీవల ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు కాస్త బ్రేక్‌పడినట్లయింది. రోస్టర్‌ పాయింట్ల వారిగా మార్చుతూ ఇక నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement