Thursday, May 16, 2024

చమురుపై భారత్‌కు రష్యా బంపరాఫర్‌.. తక్కువ రేటుకు సప్లయ్​ చేసేందుకు రెడీ

అంతర్జాతీయంగా ఎదుర్కొటున్న కఠినమైన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే స్థితిలోనూ రష్యా వెనుకంజ వేయడంలేదు. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రష్యాకు భారత్‌తో క్రూడ్‌ ఆయిల్‌ డీల్‌ ద్వారా భారీ ఉద్దీపనం లభించినట్లయింది. యుద్ధ పరిస్థితులు, తీవ్రమైన ఆంక్షల నడుమ రష్యా తక్కువ ధరకే ఇండియాకు ఆయిల్‌ సరఫరా చేయనుంది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా ఇండియాపై తీవ్రమైన ఆక్షేపణలు చేసింది. కాగా ముడి చమురు, సహజ వాయువు, వంట నూనెల ఎగుమతుల్లో అగ్రభాగన ఉండే రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత అంతర్జాతీయ మార్కెట్లుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు అన్ని దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, వంట నూనెలు, బొగ్గు, సిమెంట్‌ తదితర ధరలు భారీగా పెరిగాయి. గత నెలరోజుల్లోనే అమెరికా, యూరప్‌ దేశాల్లో పెట్రో ధరలు 50శాతానికిపైగా పెరిగాయి. పాకిస్తాన్‌ లోనైతే డీజిల్‌ నిల్వలు దాదాపు అడుగంటాయి. భారత్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉన్నా మోదీ సర్కార్‌ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆయిల్‌ బాండ్లను జారీని పూర్తిగా నిలిపేసి, ఇంధన ధరలను స్థిరీకరించేంచేలాందుకు యత్నిస్తోంది. అదే సమయంలో గల్ఫ్‌, దక్షిణ అమెరికా నుంచి లభించే సరఫరాపైనా దృష్టి సారించింది. మరోవైపు భారత్‌కు రష్యా ముడిచమురు విషయంలో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. అయితే రష్యా నుంచి రాయితీతో కూడిన ముడి చమురును భారత్‌ కొనుగులో చేస్తుండటంపై అమెరికా మండిపడింది. భారత్‌ చర్యలు ఆంక్షల ఉల్లంఘన కాదంటూనే ఇండియా తప్పుడు శక్తులకు సహకరించిందని చరిత్ర గుర్తిస్తుందని అమెరికా తిట్టిపోసింది.

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయమైన వైట్‌ హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ జేన్‌ సాకీ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా తన రిఫైనరీల్లో ఇప్పటికే సిద్ధంగా ఉంచిన క్రూడ్‌ ఆయిల్‌ను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. నిల్వలను తగ్గించుకొనే క్రమంలో మిత్ర దేశం భారత్‌కు చవక ధరకే క్రూడ్‌ ఆయిల్‌ ఇస్తామని ఆఫరిచ్చింది. ఈ సమయంలో రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలుచేస్తే యుద్ధాన్ని సమర్థించట్లవుతుందనే విషయంపై చర్చలు జరిగాయి. చివరికి రష్యన్‌ ఆయిల్‌ కొనాలనే భారత్‌ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ (ఐఓసీఎల్‌) సోమవారం నాడు 3.5మిలియన్‌ బ్యారెళ్ల ఆయిల్‌ సరఫరాకు సంబంధించి రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందానికి విటోల్‌ సంస్థ మధ్యవర్తిగా ఉంది. షిప్పులో ఆయిల్‌ను రష్యానే ఇండియాకు తరలించనుంది. మే నెలలో చమురు భారత్‌కు చేరే అవకాశముంది. కాగా రష్యా విషయంలో భారత్‌పై జోబైడెన్‌ అధికారిక ప్రతినిధి ఈ స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. రష్యా తయారీ ఎస్‌ 400 మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థను భారత్‌ కొనుగోలు చేసినప్పుడు అమెరికా వద్దని చెప్పిందేగానీ ఇంత ఘాటుగా స్పందించలేదు. వాస్తవానికి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్‌ ఏనాడూ సమర్థించలేదు. యుద్దం నిలిపేసి ఇద్దరు అధ్యక్షులు నేరుగా మాట్లాడుకోవాలని తొలుత సూచించిన ప్రపంచ నేత మోడీనే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement