Monday, April 29, 2024

శ్రీశైలం వెళ్ళే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ.. అందుబాటులో రోజూ 1,075 దర్శనం టిక్కెట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: శ్రీశైలం వెళ్ళే భక్తులు నిరంతరాయ దర్శనం కలిపించేందుకు ఆర్టీసీ సమాయత్తమైంది. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్టీసీ అమలు చేయనున్న శ్రీశైలం ప్యాకేజీ గురువారం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గత కొంతకాలంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ సరికొత్త పథకాలు ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లే భక్తులు, యాత్రికులకు సులభతర ప్రయాణం, ఆలయాల దర్శన సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి వెళ్లే ఆర్టీసీ ప్రయాణికుల కోసం ముందస్తు రిజర్వేషన్‌తో రోజుకు వెయ్యి శీఘ్ర దర్శనం టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది.

ఈ కోవలోనే దేవదాయశాఖ సమన్వయంతో శ్రీశైలం సందర్శనకు వెళ్లే భక్తులకు కొత్త ప్యాకేజీని ప్రకటించింది. శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు కొత్త ప్యాకేజీలో ముందస్తు రిజర్వేషన్‌ టిక్కెట్లతో పాటు స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం కలిపించనుంది. ఇప్పటి వరకు ఈ సదుపాయం దేవదాయశాఖ కౌంటర్లలో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంది. ఇందుకోసం వారు దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా దర్శన టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంఉంది. ఆర్టీసీ తీసుకొచ్చిన కొత్త ప్యాకేజీలో భాగంగా రోజుకు 1,075 టిక్కెట్లను ఆర్టీసీకి కేటాయించేందుకు దేవదాయశాఖ కమిషనర్‌ ఆమోదం తెలిపారు.

ప్రయాణికులు ఆర్టీసీ వెబ్‌ సైట్లలో దర్శన టిక్కెట్లతో పాటు ప్రయాణ టిక్కెట్లను ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకోవచ్చు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రతి రోజు ఆర్టీసీ 95 సర్వీసులను శ్రీశైలం నడుపుతోంది. ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణికులు శ్రీశైలం వెలుతున్న నేపధ్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణానికి 15 రోజుల ముందు నుంచే ముందస్తు రిజర్వేషన్‌ అవకాశం కలిపిస్తున్నారు. ఆర్టీసీ పోర్టల్‌ ద్వారా ఒక రోజు ముందుకూడా అందుబాటులో ఉన్న పక్షంలో రిజర్వేషన్‌ చేయించుకోవచ్చని ఎండీ తిరుమలరావు తెలిపారు.

- Advertisement -

రూ.500 స్పర్శ దర్శన టిక్కెట్లు 275, రూ.300 అతి శీఘ్ర దర్శన టిక్కెట్లు 300, రూ.150 శీఘ్ర దర్శన టిక్కెట్లు 500 ఆర్టీసీకి కేటాయించారు. ప్రయాణికులు, భక్తులు రూ.1,075తో శ్రీశైలం దర్శన టిక్కెట్లు పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. వీరికి దర్శనం సజావుగా సాగేందుకు అక్కడ ప్రత్యేకంగా ఆర్టీసీ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవదాయశాఖ సహకారంతో ఆర్టీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎండీ తిరుమలరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement