Sunday, May 19, 2024

తెలంగాణలో బియ్యం సేకరణ కొనసాగుతోంది.. ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం (బియ్యం) సేకరణ పూర్తిగా నిలిచిపోలేదని, కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా నిలిపివేశామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వెల్లడించారు. నల్గొండ ఎంపీ (కాంగ్రెస్) ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆమె ఈ విషయం పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణను అక్టోబర్‌ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. మరో ప్రశ్నకు బదులిస్తూ తెలంగాణలో 2014–15 నుంచి 2021–22 వరకు మొత్తం 4.23 కోట్ల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించామని పేర్కొన్నారు.

తెలంగాణలో 2021–22 రబీ పంట దిగుబడిలో బియ్యం సేకరణ ఆగలేదని, అయితే ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన 6వ దశ కింద రాష్ట్రంలో బియ్యం పంపిణీ చేయకపోవడం, అవకతవకలకు పాల్పడిన రైస్ మిల్లులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల తెలంగాణలో బియ్యం సేకరణ కార్యకలాపాలను జూన్‌ 7 నుంచి జూలై 19వ తేదీ వరకు నిలిపివేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్న యోజన పథకం కింద ఆహార ధాన్యాల పంపిణీతో పాటు మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి సెంట్రల్‌ పూల్‌ కోసం సేకరించాల్సిన బియ్యం సేకరణను జూలై 20 నుంచి పునరుద్ధరించామని కేంద్ర మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement