Wednesday, May 1, 2024

TS | రేషన్ కార్డులకు ఈకేవైసీ రూల్స్‌ పునఃసమీక్షించండి.. పీయూష్ కు గంగుల లేఖ!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆహార భద్రతా కార్డుల్లో కేవైసీ నిబంధనలతో నష్టపోతున్న తెలంగాణ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ కేవైసీ నిబందనలను పున:సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ప్రవాస తెలంగాణీయుల ప్రయోజనాలు కాపాడేలా రేషన్‌కార్డుల ఈకేవైసీ ప్రక్రియ నిబంధనలను సడలించాలన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. దేశ పరిస్థితులకు తెలంగాణ భిన్నమని, దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనా వైఫల్యాలతో తెలంగాణలో వలసలు పెరిగిపోయాయన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్‌, ఇతర దేశాలతో పాటు దేశంలోని బొంబాయి, బీవండి తదితర ప్రాంతాల్లో ఉన్నారని లేఖలో వివరించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ పాలనలో వలసలు ఆగిపోయాయన్నారు. అన్నిరంగాల్లో దేశానికి మార్గదర్శకంగా తెలంగాణలో నిలుస్తోందన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో దశాబ్దాల వందత్వాలు పూర్తిగా తొలిగిపోవని, అందుకే ఇంకా పెద్ద సంఖ్యలో తెలంగాణకు బయటే ఇతర దేశాల్లో ప్రవాసీలు జీవిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన కరీంగనర్‌, నిజమాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ తదితర ప్రాంతాల ప్రజలు గల్ఫ్‌ దేశాలతో పాటు- ఇతర చోట్లా… దక్షిణ తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల ప్రజలు బొంబాయి తదితర చోట్ల పెద్ద సంఖ్యలో బతుకును వెల్లదీస్తున్నారని తెలిపారు.

ప్రవాసీయులప్రయోజనాలు కాపాడడమే ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎఫ్‌ఎస్పీ కేవైసీపై పున:పరిశీలించాలన్నారు. రేషన్‌ కార్డుల ఈకేవైసీ విషయంలో తెలంగాణ పౌరులెవరూ ఆందోళనలకు గురికావద్దని సూచించారు. తెలంగాణ రేషన్‌ కార్డుదారుల ప్రయోజనాలనుు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాపాడతారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement