ప్రభ న్యూస్, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు అంతంత మాత్రంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం(2021-22) పరీక్షలకు మొత్తం విద్యార్థులు 77,369 మంది హాజరు కాగా, కేవలం 47,485 మంది మాత్రమే ఉత్తీర్ణత(61.37 శాతం) సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం(2021-22) పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 65,868 మంది విద్యార్థులు హాజరుకాగా, కేవలం 42,170 మంది మాత్రమే ఉత్తీర్ణత (64.02 శాతం) సాధించడం గమనార్హం.
కాగా.. ఇటీవల ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిల్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ పరీక్షలకు ఏర్పాటు జరుగుతున్నాయి. పరీక్షలను ఆగస్టు 1నుంచి 10వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 121 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, పరీక్షలకు దాదాపు 64,490 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైతం హైదరాబాద్ జిల్లా మెరుగైన ఫలితాలను సాధించలేకపోయింది. శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో టాప్లో ఉండగా, భాగ్యనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ జిల్లాలో మాత్రం ఇటు ఇంటర్మీడియట్ ఫలితాలతో పాటు, అటు 10వ తరగతి ఫలితాలు నిరాశజనకంగా నమోదయ్యాయి. ఈ ఫలితాలపై ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు ఇటీవల రిటైర్డు అయిన కలెక్టర్ శర్మన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు 10వ తరగతి పరీక్షల ఫలితాలపై అయితే ఏకంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డే స్వయంగా, హైదరాబాద్ జిల్లా చాలా వెనుకబడి పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.