Sunday, May 19, 2024

పీసీబీ ఆహ్వానం.. పాక్‌లో బీసీసీఐ బృందం..

పాకిస్తాన్‌ క్రికెట్‌లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తర్వాత భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) నుంచి ఇద్దరు ప్రముఖులు పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. ఆసియా కప్‌-2023 టోర్నీ ఆరంభ వేడుకల్లో పాల్గొనాల్సింది బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షాకు ఆహ్వానం అందింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడైన జై షా పాకిస్తాన్‌లో అడుగుపెడితే అది రెండు దేశాల్లో చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో జై షా స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా సోమవారం పాక్‌కు వెళ్లారు. రోజర్‌ బిన్నీ, రాజీవ్‌ శుక్లా వాఘా సరిహద్దు ద్వారా జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ మధ్య పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు.

ఆసియా కప్‌ 2023 టోర్నీలో లాహోర్‌లో సెప్టెంబర్‌ 5న అఫ్గనిస్తాన్‌- శ్రీలంక మధ్య గ్రూప్‌-బీ మ్యాచ్‌ జరుగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 6న పాకిస్తాన్‌, గ్రూప్‌ బీ2 టీమ్‌ మధ్య సూపర్‌4 మ్యాచ్‌ జరుగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు ముఖ్యఅతిథులుగా రోజర్‌ బిన్నీ, రాజీవ్‌ శుక్లా హాజరుకానున్నారు. బీసీసీఐ ప్రముఖుల కోసం పాక్‌ క్రికెట్‌ బోర్డు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. లాహోర్‌లో బీసీసీఐ బృందానికి పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ జకా అష్రఫ్‌ నేతృత్వంలో ఘనస్వాగతం పలికింది. ఇరుదేశాల బోర్డుల ప్రతినిధులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బీసీసీఐ బృందం పాక్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని పీసీబీ చైర్మన్‌ జకా అష్రఫ్‌ పేర్కొన్నారు. కేవలం క్రికెట్‌ సంబంధ అంశాలే చర్చించామన్నారు. ”పాకిస్తాన్‌లో రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్‌ సంబంధితమైనదే. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. బీసీసీఐ తరుఫున లాహోర్‌లో ఓ డిన్నర్‌ ఏర్పాటు చేస్తాం. ఇందులో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ జట్టు, బోర్డు సభ్యులు పాల్గొంటారు” అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ తెలిపారు. 2006లో మొట్టమొదటిసారి పాకిస్తాన్‌లో పర్యటించిన రోజర్‌ బిన్నీ, ”మేం కొలంబోలో మ్యాచులు చూసేందుకు వెళ్లాం. ఇప్పుడు పాకిస్తాన్‌లో వాళ్ల హోం గ్రౌండ్‌లో మ్యాచులు చూసేందుకు వచ్చాం. లాహోర్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు ఎదురుచూస్తున్నా” అని పేర్కొన్నారు.

- Advertisement -

బీసీసీఐ నుంచి ఇద్దరు ప్రముఖులు పాకిస్తాన్‌కు వెళ్లడంతో 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ గురించి చర్చ మొదలైంది. షెడ్యూల్‌ ప్రకారం 2025లో జరగాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌ సొంతం చేసుకుంది. పాక్‌లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ అంగీకరించకపోవచ్చు. బీసీసీఐ నుంచి ఇద్దరు ప్రముఖులు పాకిస్తాన్‌ వెళ్లి క్షేమంగా తిరిగి వస్తే పాకిస్తాన్‌ ఈ విషయాన్ని ఐసీసీకి నివేదికగా సమర్పించే అవకాశం ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ క్షేమంగా పాకిస్తాన్‌కు వచ్చి వెళ్లినప్పుడు భారత క్రికెట్‌ జట్టుకు ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏంటని భారత క్రికెట్‌ బోర్డును నిలదీసే అవకాశం పీసీబీకి దొరుకుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement