Friday, May 17, 2024

ఖర్కీవ్‌లో ఆపరేషన్‌ గంగా సక్సెస్‌.. సురక్షిత ప్రాంతాలకు భారతీయులు

ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ నుంచి భారతీయులందరినీ సురక్షితంగా తరలించినట్టు కేంద్రం ప్రకటించింది. ఖర్కీవ్‌ నుంచి దాదాపు భారతీయులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ప్రకటించారు. ఇక సుమీ ప్రాంతంపై దృష్టి సారించినట్టు వివరించారు. ఈ రెండు ప్రాంతాలు వార్‌ జోన్‌లు ఉన్నాయన్నారు. ఖర్కీవ్‌లో ఇక భారతీయులు ఎవరూ లేరని, ఆపరేషన్‌ గంగా ఇక్కడ విజయవంతమైందని ప్రకటించారు. ఇది ప్రతీ ఒక్కరికీ శుభవార్తే అని చెప్పుకొచ్చారు. ఇంకా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా ఎంత మంది భారతీయులు చిక్కుకున్నారో చూస్తున్నామని తెలిపారు. భారత రాయబారి కార్యాలయం.. అక్కడ ఉండే అవకాశం ఉన్నవారిని సంప్రదిస్తుందని, అయితే ఇంకా కొందరి పేర్లు నమోదు చేసుకోలేదని తెలిపారు.

సుమీ గురించి కూడా చింతిస్తున్నామని, అక్కడ హింస కొనసాగుతోందని, దీంతో అక్కడికి బస్సులు తరలించడం కష్టంగా మారిందన్నారు. పిసోచిన్‌ నుంచి 298 మంది విద్యార్థులను తరలించామని, గత 24 గంటల్లో 15 విమానాలు భారత్‌కు చేరుకున్నాయని తెలిపారు. అందులో దాదాపు 2900 మంది భారతీయులను తరలించినట్టు బాగ్చి వివరించారు. ఆపరేషన్‌ గంగా కింద ఇప్పటి వరకు 63 విమానాలు సుమారు 13,300 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు ప్రకటించారు. మరో 24 గంటల్లో 13 విమానాలు ఉక్రెయిన్‌ పరిసర ప్రాంతాలకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఆదివారం స్వదేశానికి 2200 మంది చేరుకుంటారని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement